హిందువులకు అత్యంత పవిత్రమైన 51 శక్తి పీఠాలలో ఒకటైన మాత త్రిపుర సుందరి ఆలయాన్ని పునరుద్ధరించారు. ప్రజల దీర్ఘకాల డిమాండ్ నెరవేరుస్తూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం దక్షిణ త్రిపురలోని ఉదయపూర్లో ఈ ఆలయాన్ని పునః ప్రారంభించనున్నారు. ఈ చారిత్రక ఘట్టం కోసం త్రిపుర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్లో రూ. 5,127 కోట్ల విలువైన 13 అభివృద్ధి ప్రాజెక్టులకు వర్చువల్గా ప్రారంభించిన తర్వాత ప్రధాని మోదీ సోమవారం మధ్యాహ్నం అగర్తల చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో 65 కిలో మీటర్ల దూరంలో ఉన్న గోమతి జిల్లాలోని ఉదయపూర్కు వెళ్తారు. ఇక్కడి హెలిప్యాడ్ నుంచి 12 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆలయానికి కారులో వెళ్తారు. అనంతరం 524 ఏళ్లనాటి త్రిపుర సుందరీ దేవి ఆలయాన్ని ప్రారంభిస్తారు. ఆలయ ఆవరణ మొత్తం తిరిగి పరిశీలిస్తారు. ఆ తర్వాత ప్రధాని కాళీ మాత ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆయన అగర్తల తిరిగి వచ్చి ఢిల్లీకి బయలుదేరతారు. అయితే ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ ప్రకారం.. ప్రధాని మోగీ ఎలాంటి బహిరంగ సభలో ప్రసంగించరని అధికారులు తెలిపారు.
ఈ ఆలయాన్ని 1501లో త్రిపుర రాజు మహారాజా ధన్య మాణిక్య నిర్మించారు. ఈ ఆలయం దేశంలోని 51 శక్తి పీఠాలలో ఒకటిగా, తూర్పు భారతదేశం కోల్కతాలోని కాళీఘాట్ కాళీ ఆలయం, గువాహటిలోని కామాఖ్య ఆలయం తర్వాత మూడవ ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా నిలుస్తోంది. ఇది త్రిపుర రాష్ట్ర సంస్కృతికి ఒక ప్రతీక కాగా.. భారతదేశంలో విలీనం కావడానికి ముందు అంటే 1949 అక్టోబర్ 15న త్రిపుర సంస్థానం భారత ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. అయితే కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రసాద్ పథకం కింద 524 ఏళ్ల నాటి త్రిపుర సుందరి ఆలయాన్ని పునరుద్ధరించారు. ఈ ప్రాజెక్టుకు రూ. 52 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు అయ్యింది. ఈ పునరుద్ధరణలో త్రిపుర ప్రభుత్వం కూడా రూ. 7 కోట్లు అందించింది. ఈ ఆలయాన్ని పునరుద్ధరించినందుకు త్రిపుర ప్రజలు చాలా సంతోషిస్తున్నారు.
గత రెండు వారాల్లో ముఖ్యమంత్రి మాణిక్ సాహా ప్రధాని పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఉదయపూర్ను రెండుసార్లు సందర్శించారు. పునరుద్ధరించిన ఆలయాన్ని ప్రారంభించడానికి ప్రధాని మోదీని స్వయంగా ఆహ్వానించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి సాహా తన అధికారిక ఎక్స్ ఖాతా వేదికగా ఇందుకు సంబంధించి ఓ పోస్టు కూడా పెట్టారు. అందులో తల్లి దయ వల్ల ఆలయాన్ని పునరుద్ధరించామని.. దాన్ని ప్రధాని మోదీ సప్టెంబర్ 22వ తేదీన ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఈ గొప్ప ప్రారంభోత్సవం కోసం త్రిపుర ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని వెల్లడించారు. అలాగే ఇప్పటికే ప్రధాని మోదీ ఓసారి ఈ ఆలయానికి వచ్చారన్నారు. ముఖ్యంగా 2014లో ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారని చెప్పారు. ఇది మోదీ తమ రాష్ట్రానికి వచ్చే 11వ పర్యటన అని.. ఆలయానికి మాత్రం రెండో పర్యటన అని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa