ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అదనపు కట్నం తీసుకురావట్లేదని కోడలిని పాముతో కరిపించారు

national |  Suryaa Desk  | Published : Mon, Sep 22, 2025, 07:04 PM

కాలం జెట్ స్పీడులో పరుగులు పెడుతూ.. అంతరిక్షాలను సైతం అందుకుంటున్న ఇలాంటి తరుణంలోనూ ఆడవాళ్లపై వేధింపులు ఆగడం లేదు. కట్నం కావాలని, కొడుకుల్ని కనివ్వడం లేదని భర్త సహా అత్తమామలు అరాచకంగా ప్రవర్తిస్తున్నారు. ఎవరూ ఊహించని రీతిలో కష్టపెడుతూ.. నేరం వారిపైకి రాకుండా ప్రాణాలు కూడా తీస్తున్నారు. అచ్చంగా ఇలానే చేసిందో మెట్టినిల్లు. ముఖ్యంగా తమ కోడలు అడిగినంత అదనపు కట్నం తీసుకొచ్చి ఇవ్వట్లేదని.. ఆమె ఉన్న గదిలోకి పామును వదిలారు. ఆపై తలుపులు పెట్టగా.. పాము కోడల్ని కరిచింది. మరి చివరకు ఏం జరిగిందో తెలియాలంటే మీరు ఈ కథ చదివేయాల్సిందే.


ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్ కలోనల్‌గంజ్‌కు చెందిన రేష్మకు.. షానవాజ్‌తో 2021 మార్చి 19వ తేదీన పెళ్లి జరిగింది. అయితే మొదట్లో బాగానే ఉన్న అత్తమామలు, భర్త ఆ తర్వాత కొంత కాలానికే తమ నిజమైన క్యారెక్టర్‌ను చూపించారు. ముఖ్యంగా డబ్బులపై వారికున్న అతి ప్రేమతో అదనపు కట్నం తేవాలని రేష్మను వేధించడం మొదలు పెట్టారు. పెళ్లి చేసేందుకు అప్పులు చేసి ఆర్థికంగా అనేక కష్టాలు ఎదుర్కుంటున్న కుటుంబానికి తాను మరో సమస్య కాకూడదని భావించిన రేష్మ ఆ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పలేదు. చాలా రోజులు వారు ఏం చేసినా మౌనంగానే ఉండిపోయింది.


కానీ కొంత కాలానికి రేష్మ తల్లిదండ్రులకు ఆ విషయం తెలిసింది. దీంతో రూ.1.5 లక్షల కట్నం ఇచ్చి బిడ్డను బాగా చూసుకోవాలని అత్తింటి వారి కాళ్లావేళ్లా పడ్డారు. వారి ముందు సరేనని చెప్పినా.. వారు వెళ్లిపోగానే మరో ఐదు లక్షలు తేవాలంటూ మళ్లీ వేధించడం మొదలు పెట్టారు. కానీ ఆమె అస్సలే ఇవ్వలేమని తెగేచి చెప్పగా.. రేష్మను వదిలించుకోవాలని అనుకున్నారు. ఇందుకోసం ఓ పథకం పన్నారు. వాళ్లే నేరుగా చంపితే విషయం వెలుగులోకి వచ్చి జైలుకు వెళ్లాల్సి వస్తుందని భావించి.. నేరం తమపై పడకుండా రేష్మను చంపాలనుకున్నారు. అందుకోసం ఆమెను ఓ గదిలో బంధించి.. డ్రైన్ పైపు గుండా గదిలోకి పామును వదిలారు.


ఇలా గదిలోకి వెళ్లిన ఆ పాము.. రేష్మ కాలుపై కాటు వేసింది. నొప్పి తాళలేక తలుపులు తీయమని వేడుకున్నా ఎవరూ స్పందించలేదు. ఈక్రమంలోనే గదిలో ఆమెకు ఓ ఫోన్ దొరికింది. దీంతో రేష్మ వెంటనే తన సోదరి రిజ్వానాకు ఫోన్ చేసింది. జరిగిన విషయం చెప్పింది. సోదరిని ఎలాగైనా కాపాడుకోవాలనుకున్న రిజ్వానా.. వెంటనే రేష్మ అత్తగారింటింకి చేరుకుంది. సోదరిని ఆసుపత్రికి తీసుకెళ్లింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు ధ్రువీకరించారు. మరోవైపు రేష్మ సోదరి సహా ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం కోసం అత్తింటి వారు చేసిన హత్యా యత్నం, గృహహింస గురించి వివరించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa