ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుప్రీంకోర్టుకు చేరిన తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసు

national |  Suryaa Desk  | Published : Tue, Sep 23, 2025, 08:18 AM

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకం ఆరోపణలకు సంబంధించిన కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ దర్యాప్తు అధికారి నియామకంపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కేంద్ర దర్యాప్తు సంస్థ  సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సీబీఐ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై ఈ నెల 26న విచారణ జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. లడ్డూ నెయ్యి కల్తీ ఆరోపణలపై సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం  విచారణ జరుపుతోంది. ఈ బృందంలోని దర్యాప్తు అధికారి వెంకట్రావు, విచారణలో భాగంగా చిన్నప్పన్న అనే వ్యక్తికి నోటీసులు జారీ చేశారు. అయితే, ఆ నోటీసులను సవాల్ చేస్తూ చిన్నప్పన్న హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు, సిట్‌లో వెంకట్రావు నియామకం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా లేదని పేర్కొంది. అందువల్ల, ఆయన దర్యాప్తును కొనసాగించరాదని ఆదేశాలు జారీ చేసింది.హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును సీబీఐ డైరెక్టర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ సోమవారం సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, ఈ కేసు విచారణను వాయిదా వేయాలని కోరారు. తమ వాదనలు వినిపించేందుకు ఈ నెల 26న అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.ఈ అభ్యర్థనను అంగీకరించిన ధర్మాసనం, కేసును ఈ నెల‌ 26న విచారణ జాబితాలో చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తుందా లేక కొట్టివేస్తుందా అనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa