ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీఎస్టీ బొనాంజా.. మారుతీ, హ్యుందాయ్, టాటా రికార్డు స్థాయి సేల్స్

business |  Suryaa Desk  | Published : Tue, Sep 23, 2025, 10:44 PM

కొత్త తరం జీఎస్టీ సంస్కరణలు.. సెప్టెంబర్ 22 నుంచే అమల్లోకి వచ్చాయి. ఇతర వస్తువులు, ఉత్పత్తుల సంగతి పక్కనబెడితే వాహనాలపై జీఎస్టీ 28 నుంచి 18 శాతానికి తగ్గగా.. వీటిని అన్ని కంపెనీలు ఇప్పటికే అమలు చేశాయి కూడా. తగ్గిన రేట్లతో.. ప్యాసింజర్, కమర్షియల్ వెహికిల్స్ కొత్త ధరల్ని ప్రకటించాయి. దీంతో.. నవరాత్రి తొలి రోజే.. దేశంలో కార్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. మోడళ్లను బట్టి రేట్లు భారీగా తగ్గడంతో.. జనం కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించారు. దీంతో.. ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు సెప్టెంబర్ 22న రికార్డు స్థాయిలో కార్లను డెలివరీ చేసి చరిత్ర సృష్టించాయి. ఒక్కరోజులో లక్షలాది మంది వినియోగదారులు.. కార్ల షోరూమ్స్‌కు పరుగులు తీస్తున్నారు.


>> దిగ్గజ కార్ మేకర్ మారుతీ సుజుకీ ఒక్కరోజే సుమారు 30 వేల కార్లను డెలివరీ చేసి.. 80 వేల ఎంక్వైరీల్ని నమోదు చేసింది. గత 35 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా కస్టమర్ల నుంచి అద్భుత స్థాయిలో రెస్పాన్స్ లభించిందని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ చెప్పారు.


హ్యుందాయ్ కంపెనీ నవరాత్రి తొలి రోజున ఏకంగా 11 వేలకుపైగా బిల్లింగ్స్ నమోదు చేసింది. గత ఐదేళ్లలో ఈ కంపెనీకి ఇదే అత్యుత్తమ సింగిల్ డే పెర్ఫామెన్స్ కావడం విశేషం.


టాటా మోటార్స్ సుమారు 10 వేలకుపైగా కార్లను డెలివరీ చేసింది. తన రికార్డును తానే బద్ధలు కొట్టింది. ఇంకా 25 వేలకుపైగా ఎంక్వైరీలతో పండగ సీజన్‌కు ఘన స్వాగతం పలికింది.


ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ సెప్టెంబర్ 3న జీఎస్టీ సంస్కరణల్ని ప్రకటించింది. ఈ క్రమంలోనే 4 మీటర్ల లోపు కార్లపై అంటే చిన్న కార్లపై జీఎస్టీ రేటు 28 శాతం నుంచి 10 శాతం తగ్గి 18 శాతం శ్లాబుకు చేరింది. ఇంకా గతంలో ఈ కార్లపై 1-3 శాతం వరకు సెస్ ఉండగా.. దీనిని పూర్తిగా తొలగించారు. దీంతో రేట్లు భారీగా తగ్గుముఖం పట్టాయి.


మారుతీ సుజుకీ తన మోడళ్లలో ఎస్ ప్రెస్సోపై రూ. 1.30 లక్షల వరకు తగ్గించింది. ఆల్టో కే10 రూ. 1.08 లక్షల వరకు తగ్గించింది. బాలెనో చూస్తే రూ. 86,100 వరకు ధర తగ్గించింది. మారుతీ ఫ్రాంక్స్ ధర రూ. 1.13 లక్షల ధర తగ్గింది.


హ్యుందాయ్ విషయానికి వస్తే టక్సన్ SUV ధర రూ. 2.40 లక్షల వరకు తగ్గింది. క్రెటా ధర రూ. 72,145; వెర్నా రేటు రూ. 60,640 వరకు తగ్గింది.


టాటా మోటార్స్‌లో టియాగో ధర రూ. 1.20 లక్షల వరకు తగ్గింది. టాటా పంచ్ ధర రూ. 1.58 లక్షల వరకు తగ్గింది. ఇంకా నెక్సాన్ రూ. 2 లక్షల వరకు తగ్గుముఖం పట్టింది.


ఇంకా జీఎస్టీ రేట్లతో కార్ల ధరలు తగ్గడం సహా.. పండగ సీజన్ నేపథ్యంలో ధరలపై ఇంకా డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. దీంతో అమ్మకాల జోష్ మరింత ఊపందుకుంది. డీలర్స్.. రాత్రి వరకు షోరూమ్స్‌ను తెరిచి ఉంచి మరీ కస్టమర్లకు కార్లను డెలివరీ చేస్తున్నారు. దీంతో.. ఈసారి పండగ సీజన్‌లో కచ్చితంగా సేల్స్‌లో మునుపెన్నడూ లేని విధంగా రికార్డుల్లో చరిత్ర సృష్టిస్తుందని ఆటోమొబైల్ ఇండస్ట్రీ భావిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa