ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. కొంత కాలంగా ప్రభుత్వ కంపెనీలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఎల్ఐసీ సహా ఇతర ప్రభుత్వ కంపెనీలు, ప్రభుత్వ బ్యాంకుల్లో వాటాల్ని విక్రయిస్తూ వస్తోంది. కొద్ది రోజులుగా ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయం ప్రక్రియ సాగుతోంది. ఈ ఏడాది చివరి నాటికి దీంట్లో కేంద్రం వాటాను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిపై ఇదివరకే పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్- DIPAM) సెక్రటరీ అరుణిశ్ చావ్లా వెల్లడించారు. ఇప్పుడు మరోసారి కేంద్రం వాటా విక్రయంపై మాట్లాడారు.
>> చిన్న మదుపరులకు విలువ సృష్టించేందుకు.. ఆఫర్ ఫర్ సేల్ (OFS), ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ద్వారా సుమారు అరడజనుకుపైగా ప్రభుత్వ రంగ కంపెనీల్లో వాటాల్ని విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని స్పష్టం చేశారు చావ్లా. ఇందులో ఏయే కంపెనీలు ఉన్నాయనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. అయితే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూకో బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వంటివి ఈ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు భారతీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థలో (LIC) కూడా మరోసారి పెట్టుబడుల్ని ఉపసంహరించుకునేందుకు కేంద్రం యోచిస్తుందని సమాచారం. ఇక్కడ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) మార్గదర్శకాల్ని పాటించాలంటే.. పబ్లిక్ షేర్ హోల్డింగ్ను పెంచాల్సి ఉంటుంది. అప్పుడు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఎల్ఐసీలో మరోసారి వాటా విక్రయం చేపట్టాల్సి ఉంటుంది. ఎల్ఐసీలో ప్రభుత్వానికి ప్రస్తుతం 96 శాతానికిపైగా వాటా ఉంది. ఐపీఓ ద్వారా 2022 మేలో 3.5 శాతం వాటా విక్రయించిన సంగతి తెలిసిందే. ఈ ఐపీఓ ద్వారా అప్పుడు కేంద్ర ప్రభుత్వ ఖజానాకు రూ. 21 వేల కోట్లు వచ్చి చేరాయి. ఇప్పుడు మరి కొంత విక్రయించేందుకు యోచిస్తోంది.
ఇక్కడ చావ్లా చెప్పిన దాని ప్రకారం.. మరి ఐపీఓకు వచ్చే ప్రభుత్వ రంగ సంస్థలు ఏంటా అని అంతా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే చాలా ప్రభుత్వ రంగ బ్యాంకులు స్టాక్ మార్కెట్లో ఉన్నాయి. అయితే.. సహజ వనరుల విభాగంలో ఉన్న ఒక ప్రభుత్వ కంపెనీ ఐపీఓకు వస్తుందని చావ్లా సూత్రప్రాయంగా చెప్పారు. ఇందులో ONGC, NHPC గ్రీన్ ఎనర్జీ యూనిట్స్ అయిన ONGC గ్రీన్ ఎనర్జీ, NHPC రెనివబుల్ ఎనర్జీ కూడా ఐపీఓకు వచ్చేందుకు చూస్తున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa