ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా, కేవలం జీతభత్యాల కోసం దొంగచాటుగా వచ్చి సంతకాలు పెట్టి వెళుతున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రభుత్వ విప్ రెడ్డప్పగారి మాధవి రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు సభకు రావడానికి మనసు రాని వారు, జీతాలు తీసుకోవడానికి మాత్రం రహస్య మార్గాలను ఎంచుకోవడం వారి నైతికతకు నిదర్శనమని ఆమె విమర్శించారు.అసెంబ్లీ ప్రాంగణంలో ఆమె మాట్లాడుతూ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి వైసీపీ సభ్యులు సభను బహిష్కరిస్తున్నారని, కానీ హాజరు పట్టికలో మాత్రం వారి సంతకాలు ఉంటున్నాయని ఆరోపించారు. తమ నియోజకవర్గ ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలన్న బాధ్యతను విస్మరించి, కేవలం దొంగచాటు సంతకాలపైనే శ్రద్ధ చూపుతున్నారని ఎద్దేవా చేశారు. ఇది ప్రజలను వంచించడమేనని ఆమె మండిపడ్డారు.ఇకపై ఇలాంటి దొంగచాటు వ్యవహారాలు సాగవని మాధవి రెడ్డి హెచ్చరించారు. సభలో సభ్యుల హాజరును పర్యవేక్షించేందుకు ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ను వినియోగిస్తున్నామని ఆమె తెలిపారు. ఈ కొత్త టెక్నాలజీ ద్వారా సభ్యులు సభలో ఎంతసేపు ఉన్నారనే విషయం కచ్చితంగా నమోదవుతుందని వివరించారు. సభకు రాకుండా సంతకాలు పెట్టి వెళ్లిన వారి జాబితా ఇప్పటికే తమ వద్ద ఉందని, వారిపై తగిన చర్యలు ఉంటాయని ఆమె స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడిపైనా ఉందని ఆమె గుర్తుచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa