తమిళనాడులోని కరూర్లో సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ ఎన్నికల ప్రచార సభలో జరిగిన ఘోరమైన తొక్కిసలాటలో 38 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనపై రాష్ట్ర డీజీపీ జి.వెంకటరామన్ స్పందిస్తూ తొక్కిసలాటలో అంతమంది చనిపోవడం వెనక కారణాన్ని వెల్లడించారు. ఊహించని విధంగా భారీగా జనం తరలిరావడమే ఈ విషాదానికి ప్రధాన కారణమన్న డీజీపీ.. విజయ్ ఆలస్యంగా సభకు రావడంతో ప్రజలు ఎక్కువసేపు వేచి ఉండాల్సి వచ్చిందని, తగినంత ఆహారం, నీరు అందకపోవడం కూడా పరిస్థితిని మరింత తీవ్రతరంం చేసిందని ఆయన వివరించారు.
విజయ్ ప్రచార సభకు కేవలం 10,000 మంది మాత్రమే వస్తారని నిర్వాహకులు అంచనా వేసుకున్నారని డీజీపీ తెలిపారు. 20 వేల మంది వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని భావించిన అధికారులు ఆమేరకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారని.. కానీ వాస్తవానికి 27,000 మందికి పైగా అభిమానులు హాజరయ్యారని డీజీపీ చెప్పుకొచ్చారు. "మధ్యాహ్నం 12 గంటలకు విజయ్ సభకు వస్తారని టీవీకే పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో ప్రకటించారు. దీంతో ఉదయం 11 గంటల నుంచే ప్రజలు సభ ప్రాంతానికి చేరుకున్నారు. కానీ, రాత్రి 7.40 గంటలకు విజయ్ రావడంతో ఎండలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విజయ్ వేదిక వద్దకు చేరుకున్నప్పుడు జనం ఒక్కసారిగా ముందుకు తోసుకురావడంతో ఈ తొక్కిసలాట జరిగింది," అని పేర్కొన్నారు.
ఈ సభకు 20,000 మంది వస్తారని ఊహించి పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేసినా, ఊహించని జనసందోహం వల్ల పరిస్థితి అదుపు తప్పిందని డీజీపీ తెలిపారు. సభ జరిగిన ప్రాంతం రోడ్డు కావడంతో ఎక్కువమంది పోలీసులను నియమిస్తే ప్రజలకు స్థలం సరిపోదని, అందుకే సుమారు 500 మంది పోలీసులను మాత్రమే బందోబస్తుకు నియమించామని ఆయన వివరించారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఇప్పటికే విచారణ కమిషన్ను నియమించిందని, నివేదిక వచ్చాకే పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీజీపీ చెప్పారు. "ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారని ముందుగా ఊహించడం సాధ్యం కాదు. నిర్వాహకులకు సమస్యల గురించి ముందే స్పష్టంగా చెప్పాం" అని డీజీపీ పేర్కొన్నారు.
ఈ దుర్ఘటనలో మరణించిన 38 మంది మృతదేహాలను గుర్తించినట్లు దిండిగల్ జిల్లా కలెక్టర్ ఎస్.శరవణన్ తెలిపారు. ఇప్పటివరకు 14 మంది మృతదేహాలను వారి బంధువులకు అప్పగించామని, ఒక మహిళ మృతదేహాన్ని ఇంకా గుర్తించాల్సి ఉందని చెప్పారు. ఈ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ ఘటనకు బాధ్యులెవరు అనేది విచారణ అనంతరం తేలాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa