లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. కొలంబియా పర్యటనలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ, ఆయన విదేశీ గడ్డపై పదేపదే భారత ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని, చైనా పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారని బీజేపీ ఆరోపించింది. గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ సీనియర్ నేత, ఎంపీ రవిశంకర్ ప్రసాద్ మాట్లాడారు. పవిత్రమైన విజయదశమి పర్వదినాన దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పాల్సింది పోయి, విదేశాల్లో భారత్ను విమర్శించడం అత్యంత దురదృష్టకరమని ఆయన అన్నారు. "రాహుల్ గాంధీ విదేశాల్లో ఉన్నారు. దసరా సందర్భంగా ఆయన దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపి ఉంటే బాగుండేది. కానీ దానికి బదులుగా ఆయన భారత్కు వ్యతిరేకంగా మాట్లాడడానికే ప్రాధాన్యత ఇచ్చారు" అని రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. భారత్లో ప్రజాస్వామ్యం లేదని, ప్రజలకు భావ ప్రకటనా స్వేచ్ఛ కరవైందని రాహుల్ చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. "ఇవన్నీ పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు. దేశంలో స్వేచ్ఛ లేదంటూనే, ప్రధాని మోదీని, బీజేపీని రాహుల్ నిస్సిగ్గుగా దూషిస్తున్నారు. ఇంతకంటే భావ ప్రకటనా స్వేచ్ఛ ఇంకేం కావాలి?" అని ప్రసాద్ ప్రశ్నించారు. విదేశాల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా రాహుల్ ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa