ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోజుకు 13 గంటలు పని చేయాల్సిందేనంటూ,,,గ్రీస్ ప్రభుత్వం ఆదేశాలు

international |  Suryaa Desk  | Published : Fri, Oct 03, 2025, 08:42 PM

కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకువస్తూ దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు షాక్ ఇచ్చేందుకు గ్రీస్ ప్రభుత్వం సిద్ధం అయింది. ముఖ్యంగా షిఫ్టులో పని గంటలను 13కు పెంచతున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయం తెలుసుకున్న కార్మిక యూనియన్లు, ఉద్యోగులు బుధవారం రోజు నిరసన చేపట్టారు. గ్రీస్ రాజధాని ఏథెన్స్ నగరంలో వేలాది మంది నిరసనకారులు వీధుల్లోకి వచ్చి భారీ ర్యాలీ నిర్వహించారు. దేశంలోని కార్మిక చట్టాలలో ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పులకు వ్యతిరేకంగా చేపట్టిన సాధారణ సమ్మెలో భాగంగా ఈ ప్రదర్శన జరిగింది.


ఈ 24 గంటల సమ్మె కారణంగా ఓడరేవుల్లో ఫెర్రీల సేవలు పూర్తిగా నిలిచిపోగా.. దేశవ్యాప్తంగా ప్రభుత్వ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిరసనకారులలో చాలా మంది పాలస్తీనా జెండాలను ఊపుతూ.. గాజా యుద్ధానికి తమ వ్యతిరేకతను తెలియజేశారు. అంతేకాకుండా "ఫ్రీ, ఫ్రీ పాలస్తీనా" అంటూ నినాదాలు చేశారు. ఈ కార్మిక ఆందోళన రాజకీయ, అంతర్జాతీయ అంశాలతో ముడిపడటం గమనార్హం.


సమ్మె కారణంగా ఏథెన్స్ నగరంలో దాదాపుగా రవాణా స్తంభించిపోయింది. 24 గంటల సమ్మె సమయంలో ఒక్క ట్యాక్సీ, రైలు కూడా రోడ్డుపైకి రాలేదు. రాజధాని నగరంలోని బస్సులు, సబ్వే, ట్రామ్, ట్రాలీ సేవలు సైతం పరిమిత షెడ్యూల్ ప్రకారం నడిచాయి. ఈ సమ్మె ప్రభావం పాఠశాలలు, కోర్టులు, ప్రభుత్వ ఆసుపత్రులు, మున్సిపాలిటీలతో సహా దేశవ్యాప్తంగా ఉన్న అనేక ప్రభుత్వ సేవలకు విస్తరించింది.


ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ రంగ కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న యూనియన్లు.. దేశంలో కొత్తగా తీసుకొచ్చిన కార్మిక చట్టాలను నిరసిస్తూ ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. ముఖ్యంగా కొత్త చట్టాల వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. అదనపు సమయం (ఓవర్ టైమ్) కలిపితే అప్పుడప్పుడు పని షిఫ్టులు 13 గంటల వరకు సాగే అవకాశం ఉంది. కొత్త నిబంధనల ప్రకారం.. ఓవర్ టైమ్‌తో సహా వారానికి గరిష్ఠంగా 48 గంటలు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. అంతేకాక సంవత్సరానికి గరిష్ఠంగా 150 గంటల ఓవర్ టైమ్‌కే అనుమతి ఉంది. కానీ కార్మిక సంఘాలు ఈ కొత్త నిబంధనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నిబంధనలు యజమానులచే కార్మికులు దోపిడీకి గురయ్యే అవకాశాలను పెంచుతాయని.. కార్మికుల ఆరోగ్యాన్ని, హక్కులను కాలరాస్తాయని యూనియన్లు వాదిస్తున్నాయి.


ప్రైవేట్ రంగ కార్మికుల సంఘాల సమాఖ్య అయిన ది జనరల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ వర్కర్స్ ఆఫ్ గ్రీస్ ఒక ప్రకటనను విడుదల చేసింది. "మేము 13 గంటల (షిఫ్ట్)కు ఖచ్చితంగా వ్యతిరేకం" అని వారు స్పష్టం చేశారు. "అలసట అనేది అభివృద్ధి కాదు, మనిషి తట్టుకోగలిగే సామర్థ్యానికి హద్దులు ఉన్నాయి" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ యూనియన్ తమ ప్రధాన డిమాండ్లను ముందుంచింది. అందులో ముఖ్యంగా.. వారానికి ముప్పై ఏడున్నర గంటలను(37½)ను తిరిగి ప్రవేశపెట్టాలని చెప్పారు. అలాగే సామూహిక బేరసారాల ఒప్పందాలను తిరిగి తీసుకురావాలన్నారు. కార్మికుల హక్కులను కాపాడుకోవడానికి, మెరుగైన పని పరిస్థితులను డిమాండ్ చేస్తూ గ్రీకు కార్మికులు చేసిన ఈ నిరసన దేశ రాజకీయ, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa