కెప్టెన్గా రోహిత్ శర్మ శకం ముగిసింది! ఐపీఎల్ 2024కు ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించింది. 2024 టీ20 ప్రపంచకప్ వరకు రోహిత్ శర్మనే.. భారత జట్టుకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్గా ఉన్నాడు. కానీ ఆ తర్వాత టీ20, టెస్ట్లకు వీడ్కోలు పలికి.. వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. కానీ ఇకపై అతడు కేవలం ఆటగాడిగానే జట్టులో కొనసాగనున్నాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ నుంచి టీమిండియా వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మ స్థానంలో శుభ్మన్ గిల్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ విషయాన్ని భారత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. ఈ నిర్ణయం తీసుకునేందుకు గల కారణాన్ని సైతం చెప్పాడు.
అందుకే రోహిత్కు బదులు గిల్ కెప్టెన్..
“భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. సెలక్టర్గా జట్టు అత్యుత్తమ ప్రయోజనాల గురించే ఆలోచించాలి. వన్డే ప్రపంచకప్ 2027 కోసం కొత్త కెప్టెన్ (గిల్) చుట్టూ జట్టును నిర్మించాల్సి ఉంటుంది. ఇదే సరైన నిర్ణయం. అంతేకాకుండా మూడు ఫార్మాట్లలో ముగ్గురు కెప్టెన్లు ఉండటం ప్రాక్టికల్గా అంతగా వర్కౌట్ కాదు. అన్ని జట్లకు ఒకే కెప్టెన్ ఉండటం ద్వారా హెడ్కోచ్ గౌతం గంభీర్కు కూడా పని ఈజీ అవుతుంది” అని అజిత్ అగార్కర్ వెల్లడించాడు.
ఇదే సమయంలో వన్డే ప్రపంచకప్ 2027 నాటికి రోహిత్, కోహ్లీ వన్డే టీమ్లో ఉంటారా? అనే ప్రశ్నకు సైతం అగార్కర్ బదులిచ్చాడు. అందరిలానే వారు కూడా నిబంధలను పాటించాల్సి ఉంటుందని చెప్పాడు. అందుబాటులో ఉన్నప్పుడు కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. వన్డే వరల్డ్ కప్ వరకు ఆడతామని రోహిత్, కోహ్లీ తమకు ఇప్పటివరకైతే ఎలాంటి హామీ ఇవ్వలేదని అగార్కర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇద్దరూ ఫిట్గా ఉన్నారని, బీసీసీఐ నిబంధనల ప్రకారం ఫిట్నెస్ టెస్ట్లలో పాస్ కావడంతో జట్టులోకి తీసుకున్నామని తెలిపాడు. అయితే రోహిత్ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై హిట్మ్యాన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దిగ్గజ కెప్టెన్కు ఇది అవమానం లాంటిదేనని కామెంట్లు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa