శ్రీవారి దర్శనానికి సంబంధించి వయోవృద్ధులు, దివ్యాంగులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు స్పష్టం చేసింది. కొన్ని నెలలుగా వ్యాప్తి చెందుతున్న ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని, భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఓ ప్రకటనలో పేర్కొంది.వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం దర్శన సౌకర్యాన్ని ఆపేశారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని టీటీడీ తేల్చిచెప్పింది. ప్రతినెలా మూడు నెలల ముందుగానే ఆన్లైన్లో 1000 టికెట్ల కోటాను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఈ కోటాలో టికెట్లు పొందిన వారికి ఉచితంగా లడ్డూ ప్రసాదాన్ని కూడా అందిస్తున్నామని వివరించింది. ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమలలోని నంబి ఆలయం వద్ద ఉన్న ప్రత్యేక లైన్ ద్వారా వీరిని దర్శనానికి అనుమతిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.అదేవిధంగా, అలిపిరి మెట్ల మార్గంలో మద్యం తాగిన వ్యక్తులు గాజు సీసాలు పగలగొట్టి భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ వస్తున్న మరో ఆరోపణను కూడా టీటీడీ తీవ్రంగా ఖండించింది. ఆ ఘటన అలిపిరి నుంచి రుయా ఆసుపత్రికి వెళ్లే మార్గంలో జరిగిందే తప్ప, టీటీడీ పరిధిలోని నడకమార్గంలో కాదని స్పష్టం చేసింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసేందుకే ఇలాంటి అసత్యాలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.భక్తులు ఇలాంటి వదంతులను నమ్మకుండా, కేవలం టీటీడీ అధికారిక వెబ్ సైట్లైన tirumala.org లేదా ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే సమాచారాన్ని తెలుసుకోవాలని సూచించింది. సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa