ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విమానాశ్రయ నిర్మాణంలో రైతులకి అన్యాయం జరగనియ్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 06, 2025, 04:28 PM

ప్రజలందరి ఆమోదంతోనే విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని, ఈ విషయంలో ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగదని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష రైతులకు భరోసా ఇచ్చారు. పలాస విమానాశ్రయ నిర్మాణం నేపథ్యంలో నిన్న పలాస రైల్వే గ్రౌండ్స్‌లో పరిసర గ్రామాల రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు రైతులకు హామీ ఇచ్చారు.విమానాశ్రయానికి భూములు సేకరించే ప్రక్రియలో ప్రతి గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి, గ్రామస్థుల అభిప్రాయాలతోనే పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఈ సదస్సుకు హాజరైన బిడిమి, మెట్టూరు, చీపురుపల్లి, బేతాళపురం, లక్ష్మీపురం తదితర గ్రామాల ప్రజలు తమ అభ్యంతరాలు, సూచనలు తెలియజేశారు.రైతులు తమ భూములకు అందాల్సిన ధర, స్థానిక ఉపాధి అవకాశాలు, పూర్తిగా భూమిని కోల్పోయే వారికి అదనపు ప్యాకేజీ వంటి అంశాలను నేతల దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి గ్రామంలో ఎంత భూమి అవసరమో ముందుగానే తెలియజేయాలని వారు కోరారు.కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రజల అభిప్రాయాలను స్వయంగా నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తదితర అధికారులు పాల్గొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa