ఒడిశాలోని కటక్ నగరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దుర్గామాత విగ్రహ నిమజ్జన ఊరేగింపు సందర్భంగా శనివారం చెలరేగిన హింసతో అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలో 36 గంటల పాటు కర్ఫ్యూ విధించి, 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను, సోషల్ మీడియాను నిలిపివేశారు. శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు.దుర్గా నిమజ్జన ఊరేగింపులో డీజే సౌండ్ విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం మొదలైంది. ఈ వాగ్వాదం కాస్తా తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఒకరిపై ఒకరు రాళ్లు, సీసాలతో దాడులు చేసుకోవడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. ఈ హింసాత్మక ఘటనలో ఎనిమిది మంది పోలీసుల సహా మొత్తం 25 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. “ఇలాంటి నేరాలకు పాల్పడిన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నాం” అని ఓ అధికారి వెల్లడించారు. ఈ హింసను ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ మాంఝీ తీవ్రంగా ఖండించారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa