ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రభుత్వం కొత్త ఆలోచన,,,,గ్యాస్‌తో పనిచేసే ఇస్త్రీ పెట్టెలు, సబ్సిడీ సిలిండర్ల పంపిణీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 06, 2025, 07:38 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. కులవృత్తులకు ఆర్థికంగా అండగా ఉండేలా కీలక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా బీసీల కోసం ఏపీ ప్రభుత్వం ఆదరణ పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆదరణ 3.0 పథకం కింద వివిధ కులవృత్తుల వారికి ఆధునిక పనిముట్లు అందిస్తోంది. ఆధునిక పనిముట్లను అందించి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం ద్వారా వారిని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలనేది ఏపీ ప్రభుత్వం ఆలోచన. ఈ క్రమంలోనే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మరో కొత్త ఆలోచన చేస్తున్నారు. సచివాలయం వేదికగా సోమవారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ వర్గాలతో పాటుగా, దివ్యాంగ సంక్షేమంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయా శాఖల మంత్రులతో పాటుగా ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఆదరణ 3.0 పథకం కింద రజకులకు గ్యాస్‌తో పనిచేసే ఇస్త్రీ పెట్టెలు , సబ్సిడీకి సిలిండర్లు అందించే ఆలోచన చేయాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. ఈ పథకం కింద అందించే ఆధునిక పనిముట్లు, ఆయా కులవృత్తుల వారికి ఉపయోగపడేలా ఉండాలని సూచించారు. అలాగే వెనుకబడిన వర్గాల ఆదాయాన్ని పెంచేందుకు కొత్త మార్గాలను అన్వేషించాలని అధికారులకు సూచించారు. మత్స్యకారులు సీవీడ్ సాగు లాంటి ప్రత్యామ్నాయాలు ఎంచుకునేలా వారికి అవగాహన కల్పించాలని సూచించారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చాలా ఖర్చు చేస్తున్నప్పటికీ.. ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవంటూ సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆధునీకరణతోనే కులవృత్తుల వారు ఎక్కువ ఆదాయాన్ని పొందగలుగుతారని అభిప్రాయపడ్డారు.


మరోవైపు స్థానిక సంస్థలలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఎలాంటి చిక్కులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కర్నూలు,నెల్లూరు, ఏలూరులలో బీసీ భవనాల నిర్మాణం పూర్తి చేయాలని స్పష్టం చేశారు.ఇక మైనారిటీల సంక్షేమానికి సంబంధించి ఇమామ్‌లు, పాస్టర్లకు బకాయిలు ఉంటే వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు ఆదేశించారు. హజ్ యాత్రకు వెళ్లేవారు దరఖాస్తు చేసుకునేందుకు.. దరఖాస్తు గడువును పెంచాలని సూచించారు.


మరోవైపు నసనకోట, ఆత్మకూరు బీసీ బాలికల పాఠశాలను రూ.2.65 కోట్లతో జూనియర్ కాలేజీగా అప్ గ్రేడ్ చేసేందుకు ముఖ్యమంత్రి అనుమతించారు. అదేవిధంగా తల్లికి వందనం పథకం నుంచి స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్, టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్‌కు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లలో సౌర విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa