ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరద బాధితులకు సాయం చేస్తున్న ఎంపీపై రాళ్ల దాడి

national |  Suryaa Desk  | Published : Mon, Oct 06, 2025, 08:47 PM

పశ్చిమ బెంగాల్‌లో మరోసారి రాజకీయ హింస చెలరేగింది. వరదలు ముంచెత్తిన ప్రాంతాల్లో ప్రజలను పరామర్శించి, సహాయక సామగ్రిని పంపిణీ చేయడానికి వెళ్లిన బీజేపీ లోక్‌సభ సభ్యుడు (ఎంపీ) ఒకరికి ఊహించని అనుభవం ఎదురైంది. స్థానికులలో కొందరు ఆయనపై దాడికి తెగబడటంతో.. సదరు ఎంపీకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం రాష్ట్రంలో అలజడి సృష్టించింది.


మాల్దాహా లోక్‌సభ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఖాగెన్‌ ముర్ముయే ఈ దాడికి గురైన ఎంపీ. ఆయన సోమవారం మధ్యాహ్నం వేళ.. వరద బాధిత ప్రాంతమైన జల్‌పైగురిలో పర్యటించారు. ముర్ముతో పాటు స్థానిక ఎమ్మెల్యే శంకర్ ఘోష్, ఇతర బీజేపీ నాయకులు కూడా ఉన్నారు. అయితే వీరంతా కలిసి వరద బాధితులకు సాయం చేస్తుండగా.. కొందరు స్థానికులు వీరిపైకి రాళ్లు విసిరారు. ఈక్రమంలోనే ఖాగెన్‌ ముర్ము తలకు బలమైన దెబ్బలు తగిలి.. ధారాళంగా రక్తం కారింది. విషయం గుర్తించిన పలువురు స్థానికులు, ఎంపీ వెంట ఉన్న నాయకులు.. వెంటనే ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు.


ఈ దాడిని బీజేపీ తీవ్రంగా ఖండించింది. అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీపై బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. సహాయక చర్యల్లో నిమగ్నమైన తమ పార్టీ నాయకులను టీఎంసీ కావాలనే లక్ష్యంగా చేసుకుందని విమర్శించారు. బీజేపీ ఐటీ సెల్ ఇన్‌చార్జి అమిత్ మాలవ్య గాయపడిన ఎంపీ వీడియోను ఎక్స్ వేదికగా పంచుకుంటూ.. ఈ దాడికి టీఎంసీ గూండాలే కారణమని ఆరోపించారు.


ఉత్తర బెంగాల్‌ను ముంచెత్తిన తీవ్ర వరదల మధ్య ఈ దాడి జరిగింది. శనివారం రాత్రి నుంచి జరిగిన నష్టం కారణంగా ఇప్పటి వరకు కనీసం 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా డార్జిలింగ్, జల్‌పైగురి, పరిసర ప్రాంతాలలో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడ్డాయి. దీని వల్ల వందలాది మంది నిరాశ్రయులయ్యారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఆదివారం సహాయక చర్యలు చేపట్టింది. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 160 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిలో 105 మందిని పడవల్లో, మరో 55 మందిని జల్‌పైగురిలో జిప్ లైన్‌ల సహాయంతో తరలించారు. సహాయక చర్యలు ముమ్మరం అవుతున్న నేపథ్యంలో అధికారులు నీటిమట్టాలను పర్యవేక్షిస్తూ.. చిక్కుకుపోయిన వారికి సహాయం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa