ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతిలో ప్రతిష్టాత్మక నిర్మాణం పూర్తి.. అక్టోబర్ 13న ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 08, 2025, 06:36 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే అమరావతిలో నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయి. తాజాగా అమరావతిలో ఓ కీలక ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. అమరావతిలో సీఆర్‌డీఏ ప్రాజెక్టు కార్యాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. వాస్తవానికి ఈ కార్యాలయాన్ని దసరా పండుగ సందర్భంగా ప్రారంభిస్తారని అనుకున్నారు. అయితే వివిధ కారణాలతో కొన్ని రోజులు ఆలస్యమైంది. తాజాగా అక్టోబర్ 13వ తేదీ ఉదయం 9 గంటల 54 నిమిషాలకు అమరావతి సీఆర్‌డీఏ ప్రాజెక్టు కార్యాలయం ప్రారంభించనున్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది.


సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే రాయపూడి సమీపంలో సీఆర్డీఏ కార్యాలయం నిర్మించారు. ఆకట్టుకునే ఇంటీరియర్ డిజైన్స్, ఆధునిక నిర్మాణ శైలితో సీఆర్డీఏ ఆఫీసు నిర్మించారు. ఈ కార్యాలయం అందుబాటులోకి వచ్చిన తర్వాత సీఆర్డీఏ కార్యకలాపాలువిజయవాడ నుంచి అమరావతికి మారనున్నాయి. 2014 టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఆర్డీఏ ఆఫీసు పనులు ప్రారంభించారు. 2019 నాటికి గ్రౌండ్ ఫ్లోర్, ఏడు అంతస్తుల స్ట్రక్చర్ పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో నిర్మాణంలో జాప్యం జరిగింది. 2024 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన అనంతరం చంద్రబాబు నాయుడు.. అమరావతి పునర్నిర్మాణ పనులకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు. 2024 అక్టోబరు నెలలో పనులకు భూమిపూజ చేసి ప్రారంభించారు. ప్రజాభిప్రాయం ద్వారా పది నమూనాల నుంచి ఒకదానిని ఎంపిక చేశారు. ఆ డిజైన్ ప్రకారం. భవనం ఎలివేషన్‌ రూపొందించారు.


సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం.. ప్రత్యేకతలు..


మరోవైపు సీఆర్డీఏ ఆఫీసులో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. మొత్తం 4.23 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. బిల్డప్ ఏరియా 2.42 లక్షల చదరపు అడుగులు కాగా.. ఏడు అంతస్తులలో దీనిని నిర్మించారు. ప్రతి అంతస్తూ 33 వేల చదరపు అడుగులు ఉంటుంది. సీఆర్డీఏ ఆఫీస్ గ్రౌండ్ ఫ్లోర్‌లో సమీకృత కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు. రాజధాని నిర్మాణ పనులను ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తారు. సౌండ్ ప్రూఫ్ టెక్నాలజీని ఉపయోగించి ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించారు.


అమరావతిలో ట్రాఫిక్, వాతావరణం, పారిశుద్ధ్యం వంటి అంశాలను ఈ సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తారు. సీఆర్డీఏ ప్రాజెక్టు ఆఫీసులోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏర్పాటు చేసే ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో అమరావతిలోని ప్రముఖ నిర్మాణాల మైక్రో డిజైన్లను అందుబాటులో ఉంచుతారు. సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ, ముఖ్యమంత్రి నివాసం, రాజ్ భవన్ వంటి నిర్మాణాలు మైక్రో డిజైన్లను ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఉంచుతారు.


మొదటి అంతస్తులో సమావేశ మందిరాలు ఉంటాయి. రెండు, మూడు, ఐదు అంతస్తులు సీఆర్డీఏ ఉపయోగించుకుంటుంది. నాలుగో అంతస్తులో సీడీఎంఏ (పురపాలక శాఖ డైరెక్టరేట్‌), ఆరో అంతస్తులో అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, ఏడో అంతస్తులో పురపాలక శాఖ మంత్రి పేషీతో పాటుగా పురపాలక శాఖ చీఫ్ సెక్రటరీ, ప్రజారోగ్య శాఖ ఈఎన్‌సీ, ఇతర కార్యాలయాలు ఉంటాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa