ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెజవాడ దుర్గమ్మకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న క్రేజ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 08, 2025, 06:41 PM

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. దసరా శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందుల కలగకుండా దుర్గ గుడి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. దసరా ఉత్సవాలు పూర్తైన నేపథ్యంలో హుండీలను లెక్కించారు. అయితే 2025 దసరా ఉత్సవాల సందర్భంగా కనక దుర్గమ్మ ఆలయానికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరింది. రూ.10,30,95,521 నగదును భక్తులు హుండీల ద్వారా అమ్మవారికి సమర్పించుకున్నారు. 2024 దసరా ఉత్సవాల సందర్భంగా దుర్గ గుడికి రూ.9.32 కోట్లు ఆదాయం వచ్చింది. ఈసారి పాత రికార్డును బ్రేక్ చేయడం విశేషం.


దుర్గ గుడిలో హుండీల లెక్కింపు ప్రక్రియను రెండు రోజుల పాటు నిర్వహించారు. అక్టోబర్ ఆరు, అక్టోబర్ ఏడో తేదీలలో హుండీలను రెండు విడతలుగా లెక్కించారు. మొదటి రోజు 50 హుండీలను లెక్కించిన అధికారులు.. రూ.3.57 కోట్ల నగదు, 122 గ్రాముల బంగారం, 9.7 కేజీల వెండి వచ్చినట్లు గుర్తించారు. రెండో రోజు మరో 56 హుండీలను లెక్కించగా.. రూ.6.73 కోట్ల నగదు, 265 గ్రాముల బంగారం, 9.75 కేజీల వెండి వచ్చినట్లు తేలింది. మొత్తంగా రెండు రోజులలో కలిపి 106 హుండీల ద్వారా 10,30,95,521 నగదు, 387 గ్రాముల బంగారం, 19.450 కేజీల వెండి వస్తువులు భక్తులు అమ్మవారికి సమర్పించినట్లు దుర్గ గుడి ఈవో శీనానాయక్ తెలిపారు.


మరోవైపు దుర్గ గుడి హుండీల ద్వారా వచ్చిన కానుకలలో విదేశీ కరెన్సీలు కూడా ఉన్నాయి. అమెరికా డాలర్లు (52 నోట్లు), సింగపూర్ డాలర్లు (55 నోట్లు), యూఏఈ దినార్లు (130), కెనడా డాలర్లు (5), సౌదీ రియాల్స్ (3), కువైట్ దినార్లు (7) ఉన్నాయని అధికారులు వెల్లడించారు. విజయవాడ అమ్మవారి ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోందనడానికి ఇవే ఉదాహరణలని అధికారులు అభిప్రాయపడుతున్నారు.ఈ సంవత్సరం నవరాత్రి వేడుకల సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు, హుండీల ద్వారా సమకూరిన ఆదాయం చూస్తే జనంలో భక్తి భావన పెరుగుతోందనడానికి సంకేతమని ఆలయ ఈవో శీనానాయక్ అభిప్రాయపడ్డారు. హుండీ ద్వారా సమకూరిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి, సంక్షేమ సేవలకు ఉపయోగిస్తామన్నారు.


మరోపైపు దసరా ఉత్సవాల సందర్భంగా దుర్గ గుడి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సాంకేతికత సాయంతో ఏర్పాట్లు చేశారు. పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లతో పాటుగా చిన్నారులు తప్పిపోయిన గుర్తించేలా రిస్ట్ బ్యాండ్లు వంటి సాంకేతికతను ఉపయోగించారు. అలాగే డ్రోన్లు, మొబైల్ యాప్ వంటి టెక్నాలజీ సాయంతో భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa