ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం

Crime |  Suryaa Desk  | Published : Wed, Oct 08, 2025, 06:53 PM

కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనలో ఆరుగురు చనిపోయారు. రాయవరంలోని లక్ష్మీ గణపతి ఫైర్ వర్క్స్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాణాసంచా తయారీ కేంద్రంలో ఒక్కసారిగా పేలుడు సంభవించి.. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో మంటల్లో చిక్కుకుని ఆరుగురు చనిపోయారు. బాణాసంచా తయారీ కేంద్రం నిర్వాహకుడు సత్యనారాయణ కూడా మృతి చెందినట్లు సమాచారం. మరికొంతమందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులలో ఇద్దరిని అనపర్తి ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగిన సమయంలో అందులో 40 మంది వరకూ పనిచేస్తున్నట్లు సమాచారం. పేలుడు కారణంగా బాణసంచా తయారీ కేంద్రం షెడ్డు గోడ కూడా కూలిపోయింది. ఈ శిథిలాల కింద కొంతమంది చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు.


మరోవైపు రాయవరం అగ్నిప్రమాదంపై కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్‌కుమార్‌ స్పందించారు. స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులు వారం క్రితమే బాణసంచా తయారీ కేంద్రాన్ని పరిశీలించినట్లు వెల్లడించారు. బాణాసంచా తయారీ కేంద్రంలో అన్ని రక్షణ చర్యలు ఉన్నట్లు నివేదిక కూడా ఇచ్చినట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. ఈ నేపథ్యంలో.. ఫైర్ యాక్సిడెంట్ కంట్రోల్ ఎక్విప్‌మెంట్‌ను గోడౌన్ యజమానులు సరిగ్గా ఉపయోగించారా లేదా అనేది పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. బాణాసంచా తయారీ కేంద్రంలో ప్రమాదానికి కారణాలను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు వెల్లడించారు. మరోవైపు రామచంద్రపురం ఆర్డీవో అఖిల ప్రమాదస్థలిని పరిశీలించారు.


అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన బాణసంచా పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై అధికారులతో మాట్లాడారు. ఈ ఘటనలో పలువురు చనిపోవడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితి, సహాయకచర్యలు, బాధితులకు అందుతున్న వైద్యసాయంపై చంద్రబాబు ఆరా తీశారు.


మరోవైపు ఈ ఘటనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాయవరంలో జరిగిన ఘటన దిగ్భ్రాంతికి గురి చేసిందన్న వైఎస్ జగన్.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని.. చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa