ట్రెండింగ్
Epaper    English    தமிழ்

5 సార్లు నామినేట్, ,,,మహాత్మాగాంధీకి నోబెల్ శాంతి బహుమతి ఎందుకు దక్కలేదు

national |  Suryaa Desk  | Published : Wed, Oct 08, 2025, 07:26 PM

జీవితం మొత్తం అహింసా మార్గాన్ని అనుసరించి.. ప్రపంచానికి పరిచయం చేసిన మహాత్మా గాంధీ.. శాంతి సిద్ధాంతాన్ని స్థాపించినప్పటికీ.. ఆయనకు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి మాత్రం దక్కలేదు. అయితే నోబెల్ పీస్ ప్రైజ్‌కు గాంధీజీ.. ఐదు సార్లు (1937, 1938, 1939, 1947, 1948) ఏడాదుల్లో నామినేట్ అయినప్పటికీ.. నార్వేజియన్ నోబెల్ కమిటీ ఆయనకు నోబెలు పురస్కారాన్ని ఇవ్వకపోవడంపై అప్పట్లోనే తీవ్ర చర్చకు దారితీసింది. ఇక మహాత్మాగాంధీ అనుచరులైన దలైలామా, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, నెల్సన్ మండేలా వంటి వారికి కూడా ఈ నోబెల్ శాంతి బహుమతి దక్కింది.. కానీ ఆయనను మాత్రం కమిటీ విస్మరించింది.


మహాత్మాగాంధీకి నోబెల్ దక్కకపోవడానికి కారణాలు


నోబెల్ శాంతి బహుమతి కోసం ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 5 సార్లు గాంధీజీ నామినేట్ అయినప్పటికీ.. ఆయన నామినేషన్లను నోబెల్ కమిటీ తిరస్కరించడానికి పలు కారణాలు ఉన్నాయి. మహాత్మాగాందీ జీవితంలోని వివిధ దశల్లోని రాజకీయ పరిస్థితులు, నోబెల్ కమిటీ సభ్యుల రకరకాల అభిప్రాయాల కారణంగా ఆయన ఆ అదృష్టానికి నోచుకోలేకపోయారు.


మొట్టమొదట 1937లో నోబెల్‌కు గాంధీ నామినేట్


నార్వేజియన్ పార్లమెంట్ సభ్యుడు ఓలే కొల్‌బ్యార్న్‌సెన్ 1937లో.. నోబెల్ శాంతి బహుమతికి మహాత్మా గాంధీని నామినేట్ చేశారు. అయితే నోబెల్ కమిటీ సలహాదారు అయిన ప్రొఫెసర్ జాకబ్ వార్మ్ ముల్లర్.. గాంధీజీని ప్రశంసించినప్పటికీ.. ఆయన అనుసరించిన విధానాల్లో తీవ్రమైన మలుపులు ఉంటాయని విమర్శలు చేశారు. గాంధీజీ తరచూ క్రీస్తులా కనిపిస్తారని.. కానీ అకస్మాత్తుగా ఒక సాధారణ రాజకీయ నాయకుడిగా మారిపోతారని పేర్కొంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. గాంధీజీ స్వాతంత్ర్య సమరయోధుడు, నియంత, ఆదర్శవాది, జాతీయవాది వంటి పాత్రల మధ్య వైరుధ్యం ఉందని జాకబ్ వార్మ్ ముల్లర్ పేర్కొన్నారు.


1947లో భారత్-పాక్ వివాదం


1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం, దేశ విభజన తర్వాత మహాత్మాగాంధీ మరోసారి నోబెల్ శాంతి బహుమతి విజేతల షార్ట్‌లిస్ట్‌లోకి వచ్చారు. అయితే ఆ సమయంలో నోబెల్ కమిటీ సభ్యులు.. భారత్-పాకిస్తాన్ సంఘర్షణను పరిగణలోకి తీసుకున్నారు. భారత్ పాక్ యుద్ధంలో గాంధీజీ భారత్‌కు బలంగా కట్టుబడి ఉన్నారని మార్టిన్ ట్రాన్మే సహా పలువురు సభ్యులు వాదించారు. అంతేకాకుండా అంతకుముందు జరిగిన ఒక ప్రార్థనా సమావేశంలో గాంధీ యుద్ధాన్ని స్థిరంగా తిరస్కరించే వైఖరిని వదులుకున్నట్లు సూచించారనే అంశాన్ని కమిటీ సభ్యులు గట్టిగా లేవనెత్తారు. ఈ క్రమంలోనే ఐదుగురు సభ్యుల ప్యానెల్‌లో ముగ్గురు సభ్యులు గాంధీజీకి నోబెల్ శాంతి బహుమతి ఇచ్చేందుకు వ్యతిరేకించడంతో.. 1947 ఏడాదికి క్వేకర్స్‌కు ఇవ్వాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు.


1948లో మరణానంతరం తిరస్కరణ


ఇక 1948 జనవరిలో గాంధీజీ నోబెల్ శాంతి బహుమతికి చివరిసారి నామినేట్ అయ్యారు. కానీ.. ఆ ఏడాదిలో నామినేషన్ల గడువు ముగియడానికి కేవలం 2 రోజుల ముందు అంటే.. 1948 జనవరి 30వ తేదీన ఆయన గాడ్సే చేతిలో హత్యకు గురయ్యారు. నోబెల్ కమిటీ నియమం ప్రకారం.. విజేతను ప్రకటించిన తర్వాత ఆ వ్యక్తి మరణిస్తే తప్ప.. మరణానంతరం అవార్డు ఇవ్వడానికి వీలు లేదు. ఈ కారణంగానే జీవించి ఉన్న అభ్యర్థి ఎవరూ లేరని పేర్కొంటూ.. 1948 నోబెల్ శాంతి బహుమతిని ఎవరికీ ప్రకటించకుండా నిలిపివేశారు. దీంతో అన్నిసార్లు నోబెల్ శాంతి బహుమతి చేతి దాకా వచ్చినట్లే వచ్చి గాంధీజీకి దక్కకుండా పోయింది.


1989లో విచారం వ్యక్తం చేసిన కమిటీ


1989 నోబెల్ శాంతి బహుమతి.. టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామాకు వరించింది. అయితే ఆ సమయంలో.. నోబెల్ శాంతి బహుమతిని గాంధీకి ఇవ్వకపోవడంపై నోబెల్ కమిటీ సభ్యులు విచారం వ్యక్తం చేశారు. ఆ అత్యున్నత పురస్కారం.. మహాత్మా గాంధీ జ్ఞాపకార్థం ఒక నివాళిలో భాగమని పేర్కొన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa