ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.60 కోట్లు కట్టండి': శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రాకు బాంబే హైకోర్టు షాక్

national |  Suryaa Desk  | Published : Wed, Oct 08, 2025, 07:34 PM

బాలీవుడ్ స్టార్ నటి శిల్పా శెట్టికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ వ్యాపారవేత్తను మోసం చేసిన కేసు విచారణలో భాగంగా.. ఆమె విదేశాలకు వెళ్లేందుకు బాంబే హైకోర్టు అనుమతి నిరాకరించింది. ఈ సందర్భంగానే న్యాయస్థానం.. ముందు రూ.60 కోట్లు చెల్లించండి అంటూ శిల్పా శెట్టి దంపతులకు సూచించడం చర్చనీయాంశంగా మారింది.


శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతులు రూ.60 కోట్ల మేర మోసానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ముంబైకి చెందిన వ్యాపారవేత్త దీపక్ కొఠారీ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2015 నుంచి 2023 మధ్యకాలంలో తన కంపెనీ రుణం, పెట్టుబడి రూపంలో రూ.60.4 కోట్లను ఈ దంపతులకు ఇచ్చిందని కొఠారీ తెలిపారు. అయితే ఈ సొమ్మును వారు తమ వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకున్నారని ఆరోపించారు. అంతేకాకుండా రాజేశ్ ఆర్య అనే వ్యక్తి ద్వారా తాను శిల్పా-రాజ్ దంపతులను కలిసినట్లు దీపక్ కొఠారీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పట్లో వారు 'బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్' అనే హోమ్ షాపింగ్ కంపెనీకి డైరెక్టర్లుగా ఉన్నట్లు తెలిపారు. కేసులోని ఈ 'బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్' కంపెనీ ప్రస్తుతం మూతపడింది.


దీపక్ కొఠారీ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి, మోసం, నమ్మక ద్రోహం వంటి సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మోసం మొత్తం రూ.10 కోట్లకు పైగా ఉండటంతో.. కేసును జుహు పోలీస్ స్టేషన్ నుంచి ఆర్థిక నేరాల విభాగానికి (EOW) బదిలీ చేశారు. ప్రస్తుతం ఈ కేసును EOWయే దర్యాప్తు చేస్తోంది. కేసు విచారణ జరుగుతున్నందున.. దర్యాప్తు సంస్థ ఇప్పటికే శిల్పా దంపతులపై లుకౌట్ నోటీసులు జారీ చేసింది. దీనివల్ల వారు విదేశాలకు వెళ్లాలంటే కోర్టు లేదా దర్యాప్తు అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి.


అయితే తాజాగా శిల్పాశెట్టి దంపతులు.. అక్టోబరు 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు శ్రీలంకలోని కొలంబోలో జరగనున్న ఓ యూట్యూబ్ ఈవెంట్‌కు హాజరు అయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అయితే విచారణ అనంతరం కోర్టు ఆమె అభ్యర్థనను తిరస్కరించింది. ముందు రూ.60 కోట్లు కట్టమంటూ వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను అక్టోబరు 14వ తేదీకి వాయిదా వేసింది.


రూ.60 కోట్ల మోసం కేసు విషయంలో ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం అధికారులు రెండు రోజుల క్రితమే శిల్పా శెట్టిని విచారించారు. సోమవారం ఆమె ఇంటికి వెళ్లిన అధికారులు దాదాపు నాలుగున్నర గంటలపాటు ప్రశ్నించినట్లు సమాచారం. ఈ విచారణలో బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక అంశాల గురించి ప్రధానంగా ఆరా తీసినట్లు తెలుస్తోంది. శిల్పా శెట్టి వాంగ్మూలాన్ని రికార్డ్ చేసిన అధికారులు.. ఆమె నుంచి కీలకమైన పత్రాలను కూడా సేకరించారు. అంతకుముందు నెలలో ఇదే కేసులో రాజ్‌ కుంద్రాను కూడా పోలీసులు సుమారు 5 గంటల పాటు విచారించి, ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa