ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అఫ్గన్ సరిహద్దుల్లో భారీ సైనిక ఆపరేషన్.. 11 మంది జవాన్లు, 19 మంది ఉగ్రవాదులు మృతి

international |  Suryaa Desk  | Published : Wed, Oct 08, 2025, 09:37 PM

ఖైబర్‌ పఖ్తూంఖ్వా ప్రావిన్సుల్లో పాకిస్థాన్ సైన్యం భారీ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్ లెఫ్టినెంట్ కల్నల్, మేజర్ సహా 11 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. 19 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అఫ్గనిస్తాన్ సరిహద్దు ప్రావిన్సుల్లోని ఒరక్జాయ్ జిల్లాలో తెహ్రిక్ ఇ తాలిబన్ పాకిస్థాన్‌ (పాక్ తాలిబన్లు) సంస్థకు చెందిన ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగింది. ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో ఉన్నారనే నిఘా వర్గాల సమాచారంతో మంగళవారం రాత్రి భారీ ఆపరేషన్ ప్రారంభించినట్టు పాక్ ఆర్మీ ప్రకటించింది. తాము చేపట్టిన ఈ ఆపరేషన్‌ ఆ ప్రాంతంలో ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలిస్తుందని ఆర్మీ తెలిపింది.


గత నెలలో ఇదే ప్రావిన్సుల్లోని కరాక్ జిల్లాలో ఉగ్రవాద స్థావరంపై విరుచుకుపడిన పాక్ సైన్యం 17 మంది టీటీపీ ఉగ్రవాదులను హతమార్చింది. అయితే, ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. దీనికి ముందు డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో చేపట్టిన ఆపరేషన్‌లో 13 మంది పాకిస్థాన్ తాలిబన్ ఉగ్రవాదులను మృతిచెందారు. ఇటీవల కొన్నేళ్లుగా పాకిస్థాన్‌లో ఉగ్రవాద సంబంధిత హింస పెరుగుతోంది. ఈ ఘటనల్లో ఎక్కువ శాతం వాటికి టీటీపీ బాధ్యత వహించింది. అఫ్గనిస్థాన్‌లో ఆగస్టు 2022లో తాలిబన్లు తిరిగి అధికారం చేపట్టినప్పటి నుంచి టీటీపీ కార్యకలాపాలు తీవ్రతరం చేసింది. ఆ గ్రూప్‌కి చెందిన చాలా మంది నేతలు, ఉగ్రవాదులు అఫ్గన్‌లో తలదాచుకుంటున్నారు.


గత నెలలో పాక్ ప్రభుత్వం తిరా లోయలోని ఉగ్రవాదుల కేంద్రంగా పేర్కొంటూ ఒక గ్రామంపై జరిపిన బాంబు దాడి ఆ ప్రాంతంలో హింస, సైనిక చర్య స్థాయి స్పష్టంగా బయటపెట్టింది. టీటీపీ బాంబుల తయారీ ఫ్యాక్టరీని లక్ష్యంగా చేసుకున్న ఈ ఆపరేషన్‌లో మహిళలు, పిల్లలు సహా ముప్పై మంది పౌరులు మరణించారు. గత మూడు నెలల్లోనే పాకిస్థాన్ వ్యాప్తంగా తీవ్రవాద సంబంధిత హింస 46 శాతం పెరిగినట్టు ఓ నివేదిక వెల్లడించింది. మొత్తం 329 ఉగ్రదాడులు, సైన్యం ఆపరేషన్లలో 901 ప్రాణాలు కోల్పోయారని, రో 599 మంది గాయపడ్డారని తెలిపింది. ఖైబర్‌ఫఖ్తూంఖ్వా, బలూచిస్థాన్ ప్రావిన్సులు అఫ్గన్‌ సరిహద్దుల్లోనే ఉన్నాయి. పాక్‌లోని మొత్తం ఉగ్రవాద సంబంధిత హింసలో 96 శాతం ఈ రెండు ప్రావిన్సుల్లోనే చోటుచేసుకోవడం గమనార్హం. ఖైబర్ పఖ్తూంఖ్వా ప్రావిన్స్‌ అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది. పాక్ మొత్తం హింసాత్మక ఘటనల్లో సుమారు 71 శాతం మరణాలు, 67 శాతం ఘటనలు ఈ ప్రాంతంలోనే చోటుచేసుకున్నాయి. అటు, బలూచిస్థాన్‌లోని వేర్పాటువాద ఉద్యమం పాకిస్థాన్‌కు కంటిలో నలుసుగా తయారయ్యింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ మెరుపు దాడులతో పాక్ సైన్యాలు హడలిపోతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa