తమ దేశంలోని ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా కాలంగా అంటున్న విషయం తెలిసిందే. అందుకే వలసదారులపై కఠిన వైఖరి అవలంభిస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల నిపుణులకు ఇచ్చే హెచ్ 1బీ వీసాపై ఫీజును లక్ష డాలర్లకు పెంచారు. విదేశీయులను ఉద్యోగాల్లోకి తీసుకోవాలనుకుంటే.. కంపెనీలు ఈ ఫీజు చెల్లించి వీసాలు స్పాన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల భారతీయులపై ఎక్కువగా ప్రభావం పడింది. హె1బీ నిపుణుల వల్ల ఎక్కువ ప్రయోజనం పొందుతున్న టెక్ కంపెనీలు కూడా ట్రంప్ నిర్ణయాన్ని సమర్థించాయి. టెగ్ దిగ్గజం ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ అందులో ఒకరు. అయినప్పటికీ హెచ్1బీ ఫీజుల విషయంలో వెనకడుగు వేయమని చెప్పారు జెన్సర్. విదేశీ నిపుణులకు వీసాలు స్పాన్సర్ చేయడం కొనసాగిస్తామన్నారు. ఈ మేరకు ఉద్యోగులకు ఈమెయిల్ పంపారు.
వారు లేకపోతే కష్టమే..!
తమ కంపెనీలో చాలామంది విదేశీ నిపుణులు పనిచేస్తున్నట్లు ఎన్విడియా సీఈఓ తెలిపారు. అందులో తాను ఒకడినని చెప్పారు. "అమెరికాలో మనకు దొరికిన అవకాశాలు మన జీవితాలను మార్చేశాయని నేను నమ్ముతున్నాను. ప్రపంచంలోని నలు మూలల నుంచి అమెరికాకు వలస వచ్చిన ప్రతిభావంతులే ఎన్విడియాను కూడా తీర్చిదిద్దారు. ఆ విదేశీ నిపుణులే లేకపోతే ఈ విజయం సాధ్యమయ్యేది కాదు. టెక్నాలజీ రంగంలో అమెరికా అగ్రగామిగా కొనసాగడానికి చట్టబద్ధమైన వలసలు అవసరమే. అందుకోసమే హెచ్1బీ వీసా ఫీజు పెంపుతో ఆగకుండా.. ప్రపంచ నలుమూలల నుంచి ట్యాలెంట్ను తీసుకుంటాం " అని జెన్సన్ ఈ మెయిల్లో రాసుకొచ్చారు.
డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసా ఫీజును పెంచడాన్ని జెన్సన్ హువాంగ్ గతంలో సపోర్ట్ చేశారు. ఇలా చేయడం తనకు ఆనందంగా ఉందన్నారు. లక్షల డాలర్లు ఎక్కువే అయినా.. ఇది గొప్ప ప్రారంభమని చెప్పారు. అయితే స్టార్టప్లు ఈ మొత్తాన్ని భరించలేవని తెలిపారు.
ఎన్విడియా కంపెనీ పెద్ద మొత్తంలో హెచ్1బీ వీసాదారులను నియమించుకుంటోంది. ప్రపంచంలోని ఏఐ రీసెర్చర్లలో సగం మంది చైనీయులే అని కంపెనీ గతంలో ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నేపథ్యంలో హెచ్1బీ వీసాలను స్పాన్సర్ చేయడం తప్ప ఎన్విడియాకు మరో మార్గం లేకుండా పోయింది. ఈ కెంపెనీ సీఈఓ ప్రకటన కూడా అందులో భాగమే అని విశ్లేషకులు అంటున్నారు.
ట్రంప్ తీసుకువచ్చిన హెచ్1బీ వీసా ఫీజు పెంపును యూనియన్లు, విద్యా సంస్థలు, మతపరమైన సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత నెల ఇలాంటి ఓ సంస్థ.. ఫీజు పెంపును సమర్థించుకోలేని, చట్టవ్యతిరేక చర్యగా అభివర్ణించింది. అమెరికా కాంగ్రెస్ రూపొందించిన పథకాన్ని ఏకపక్షంగా ట్రంప్ యంత్రాంగం మార్చలేదని కోర్టు మెట్లు ఎక్కింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa