బీహార్ రాజకీయ రంగంలో ప్రధాన పార్టీలు మళ్లీ ఒకదానిపై ఒకటి పైచేయి సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి మరోసారి అధికారాన్ని నిలుపుకోవాలని లక్ష్యంగా ప్రచారాన్ని ఉధృతం చేస్తుండగా, ప్రతిపక్ష కూటములు కూడా ఏ క్షణానికైనా సిద్ధంగా ఉన్నాయి.ఈ నేపథ్యంలో, జన్ సురాజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గురువారం తన పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో మొత్తం 51 మంది అభ్యర్థులు చోటు దక్కించుకున్నారు. అయితే ఆశ్చర్యకరంగా ఈ లిస్ట్లో ప్రశాంత్ కిషోర్ పేరు కనిపించలేదు. అయితే, దీనికి వ్యూహాత్మక కారణాలున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.రాఘోపూర్ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పోటీ చేసే అవకాశం ఉంది. లేదా ఆయన సొంత స్థలం అయిన కర్గహార్ నుంచే బరిలో దిగే అవకాశమూ ఉంది. ఈ క్రమంలో, కర్గహార్ నియోజకవర్గానికి జన సురాజ్ అభ్యర్థిగా రితేష్ రంజన్ పాండేను ప్రకటించారు. దీంతో రాఘోపూర్లో ఎవరిని బరిలోకి దింపుతారన్నదే ఇప్పుడు ప్రశ్న. ఈ స్థలం నుంచే ప్రశాంత్ కిషోర్ పోటీ చేసే అవకాశముందని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. "బీహార్ బిడ్డ"గా ఆయన తనను తాను అభివర్ణించుకుంటున్నారు.ప్రశాంత్ కిషోర్ విడుదల చేసిన తొలి జాబితాలో సామాజిక న్యాయం, సమతుల్యతకు ప్రాధాన్యం ఇచ్చారు. అందులో 16 శాతం ముస్లింలకు, 17 శాతం అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందినవారికి చోటు కల్పించారు. అభ్యర్థుల్లో రిటైర్డ్ అధికారులు, వైద్యులు, న్యాయవాదులు, విద్యావేత్తలు కూడా ఉన్నారు. గత ఎన్నికల్లో రెండు ప్రధాన కూటములు కలిపి 72 శాతం ఓట్లు మాత్రమే పొందగలిగాయని గుర్తుచేస్తూ, ఈసారి 48 శాతం ఓటు వాటాను తమ పార్టీ సాధించగలదని ప్రశాంత్ కిషోర్ ధీమా వ్యక్తం చేశారు.అభ్యర్థుల ఎంపికలో అవినీతి లేని వ్యక్తులను మాత్రమే ఎంపిక చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. క్లీన్ ఇమేజ్ ఉన్నవారినే ప్రాధాన్యంగా తీసుకున్నట్లు వివరించారు.కుమ్రార్ నియోజకవర్గానికి ఎంపికైన అభ్యర్థి కేసీ సిన్హా పాట్నా యూనివర్శిటీలో వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. ఆయన రచించిన గణిత పాఠ్యపుస్తకాలు బీహార్తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా వినియోగించబడ్డాయి.మాంఝీ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోయే వైబీ గిరి, పాట్నా హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా సేవలందించారు. ఆయన బీహార్ రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్గా, కేంద్ర ప్రభుత్వ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్గా కూడా పనిచేశారు.ముజఫర్పూర్ నియోజకవర్గానికి ఎంపికైన డాక్టర్ అమిత్ కుమార్ దాస్ పాట్నా మెడికల్ కాలేజ్ మాజీ విద్యార్థి. ఆయన గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవల విస్తరణ కోసం విశేషంగా కృషి చేశారు. ఆయన భార్య కూడా డాక్టర్ కాగా, ఇద్దరూ కలిసి ముజఫర్పూర్లో ఒక ఆసుపత్రి నడుపుతున్నారు.మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్లో ఈసారి ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుండగా, ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది.ఓ వైపు ఎన్డీఏ-ఇండియా కూటములు హోరాహోరీగా పోటీపడుతుండగా, మరోవైపు ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన సురాజ్ పార్టీ తొలిసారి బరిలోకి దిగుతోంది. అయితే ఈసారి ప్రజలు తమ భవిష్యత్ను ఎవరి చేతిలో ఉంచుతారో చూడాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa