ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ జిల్లాలకు సూపర్ న్యూస్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 10, 2025, 07:04 PM

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శుక్రవారం సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం పలు ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. కేబినెట్ భేటీలో శ్రీశైలం దేవాలయాన్ని పెద్దఎత్తున అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు మంత్రి పార్థసారథి వివరించారు. అలాగే విజయనగరంలో పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టు, కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రిలయన్స్‌ కంజ్యూమర్ ప్రాజెక్టు, పర్యాటక ప్రదేశాల్లో స్టార్‌ హోటళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు మంత్రి వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన పలు సంస్థలకు భూమి కేటాయింపులు, రాయితీలకు ఆమోదం తెలిపినట్లు వివరించారు.


మరోవైపు ఏపీలో ఫుడ్ పార్క్ ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ సంస్థ ఆసక్తి చూపుతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రిలయన్స్ కంజ్యూమర్ ప్రొడక్ట్స్ 40 వేల కోట్లతో వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కులు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. అందులో భాగంగానే ఏపీలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రూ.768 కోట్లతో ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఓర్వకల్లు ప్రాంతంలోని బ్రాహ్మణపల్లిలో రిలయన్స్ ఫుడ్ పార్కు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రచించింది.


హైదరాబాద్, బెంగళూరుకు సమాన దూరంలో ఉండటంతో రిలయన్స్ సంస్థ ఓర్వకల్లు ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు్ తెలిసింది. ఓర్వకల్లు నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే రోడ్డు మార్గంలో మూడు గంటలు పడుతుంది. అలాగే బెంగళూరు వెళ్లాలంటే 5 గంటలు సమయం పడుతుంది. ఈ నేపథ్యంలోనే బ్రాహ్మణపల్లి వద్ద రిలయన్స్ కంజ్యూమర్ ప్రొడెక్ట్ ఫుడ్ పార్కు ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది.


రిలయన్స్ ఫుడ్ పార్కులో నూడుల్స్, చాకోలెట్స్, స్నాక్స్,అట్టా, మసాలాలు తయారు చేస్తారు. రిలయన్స్ ఫుడ్ పార్కు ఏర్పాటుకు ఏపీ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఇప్పటికే ఆమోదం లభించింది. ఇందుకోసం 120 ఎకరాలు కేటాయించేందుకు అంగీకారం తెలిపినట్లు తెలిసింది. తాజాగా ఓర్వకల్లులో రిలయన్స్ ప్రాజెక్టుకు ఏపీ కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. దీంతో త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే కర్నూలు జిల్లా వాసులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. మరోవైపు ఏపీలో రిలయన్స్ సంస్థ బయోగ్యాస్ ప్లాంట్లను కూడా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తంగా ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని కూటమి వర్గాలు చెప్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa