తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి అక్రమ సాగుపై పోలీసు యంత్రాంగం తన దాడులను ముమ్మరం చేసింది. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు.. ఆదిలాబాద్ రూరల్ పరిధిలో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో భారీ మొత్తంలో గంజాయి మొక్కలు లభ్యమయ్యాయి.
ఆదిలాబాద్లో 160 గంజాయి మొక్కల స్వాధీనం
ఆదిలాబాద్ గ్రామీణ మండలం, అశోద గ్రామంలో గంజాయిని పెంచుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు.. రూరల్ ఎస్సై వి విష్ణువర్ధన్ నేతృత్వంలో పోలీసు బృందం పంట పొలాలపై ఆకస్మిక దాడులు నిర్వహించింది. నిందితుడు తన పత్తి, కంది పంటల మధ్యలో అంతర పంటగా చట్టవిరుద్ధంగా గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
వివిధ ఎత్తుల్లో (మూడు నుంచి ఏడు అడుగుల వరకు) ఉన్న మొత్తం 160 గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి వెల్లడించిన ప్రకారం.. వీటి బహిరంగ మార్కెట్ విలువ సుమారు రూ. 16 లక్షలు వరకు ఉంటుంది. ఈ కేసులో మిశ్రమ్ భుజంగరావు (20) అనే అశోధా గ్రామం నివాసిని నిందితుడిగా గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
గంజాయి వంటి మాదకద్రవ్యాల సాగు, రవాణా, వ్యాపారం అనేది జిల్లాలో ఉక్కు పాదంతో అణచివేస్తున్నామని డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. గంజాయి పండించినా.. రవాణా చేసినా, లేదా సేవించినా చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కేసులో విభిన్న చట్టాల ప్రకారం ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఇంతేకాకుండా.. గంజాయి సాగు చేస్తున్న వారికి ప్రభుత్వ పథకాలు వర్తించకుండా నిరోధించేందుకు జిల్లా కలెక్టర్ కు నివేదికలు పంపనున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ భారీ గంజాయి మొక్కల పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన రూరల్ సీఐ కె ఫణిధర్, ఎస్సై విష్ణువర్ధన్.. ఇతర సిబ్బందిని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు. గంజాయి అక్రమ కార్యకలాపాల గురించి సమాచారం తెలిస్తే.. వెంటనే పోలీసులకు తెలియజేయాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్ రహితంగా మార్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం పోలీసు యంత్రాంగం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోంది. అక్రమ గంజాయి సాగు (Illegal Cultivation), రవాణా, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించి, కఠినమైన చర్యలు అమలు చేస్తోంది.
డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక వ్యవస్థ 'ఈగల్'..
తెలంగాణలో గంజాయి, డ్రగ్స్ సమస్యను మూలాల నుంచి పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో గంజాయి మొక్కల సాగును పూర్తిగా అరికట్టడం.. సరిహద్దుల గుండా జరిగే మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించడం ఈగల్ ముఖ్య ఉద్దేశం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa