ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోన్న స్త్రీ శక్తి పథకానికి మంచి ఆదరణ లభిస్తోంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన నాటి నుంచి బస్సుల్లో రద్దీ పెరుగుతోంది. అయితే కొన్ని రూట్లలో మహిళా ప్రయాణికుల వద్ద నుంచి కూడా ఛార్జీ వసూలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో బస్ స్టాప్ ఉన్నా బస్సులు ఆగడం లేదు. ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ డయల్ యువర్ డీఎం కార్యక్రమం ప్రారంభించింది. దీనిలో భాగంగా రాజమహేద్రవరం డిపో మేనేజర్ కె.మాధవ ప్రయాణికులు సమస్యలు తెలుసుకుని.. పరిష్కరించారు. ఈక్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజమహేంద్రవరం డిపో మేనేజర్ కె.మాధవ.. డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో కుక్కునూరు రూట్లో స్త్రీ శక్తి పథకం అమలు కావడం లేదని, ఛార్జీల విషయంలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని.. పైగా పురుషులు కూడా ఎక్స్ప్రెస్ బస్సు ఛార్జీల కంటే కూడా ఎక్కువే చెల్లించాల్సి వస్తుందని డిపో మేనేజర్కి తెలిపారు. ఈ ఫిర్యాదులపై ఆయన స్పందించారు.
దీనిపై డీఎం మాధవ స్పందిస్తూ.. రాజమహేంద్రవరం-భద్రాచలం వయా కుక్కునూరు రూట్లోని అల్ట్రా డీలక్స్ సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే స్త్రీశక్తి పథకం వర్తించదని తెలిపారు. అంతర్రాష్ట్ర సర్వీసుల్లో అలానే ఇతర రాష్ట్రాల్లో 16 కిలోమీటర్ల లోపు ప్రయాణ పరిధి ఉంటేనే స్త్రీ శక్తి పథకం వర్తిస్తుందని ఆయన ప్రయాణికులకు తెలిపారు.
మరి కొందరు ప్రయాణికులు మాట్లాడుతూ.. ఆర్టీసీ ప్రస్తుతం రద్దు చేసిన రాజమహేంద్రవరం-పేకేరు నైట్హాల్టు బస్సును తిరిగి నడపాల్సిందిగా కోరారు. దీనిపై మాధవ స్పందిస్తూ.. ఈ బస్సుకు సరైన ఆదాయం లేకపోవడం వల్లే ఆ సర్వీసును రద్దు చేశామని తెలిపారు. అయితే, కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చాక ఆ సర్వీసును పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. అలానే వేమగిరి గట్టు వద్ద రిక్వెస్ట్ స్టాప్ ఉన్నప్పటికీ కొన్ని బస్సులు ఆగడం లేదని.. అలానే బొబ్బిల్లంక స్టేజీ వద్ద కూడా ఇదే సమస్య ఉందని ఫిర్యాదు వచ్చింది. దీనిపై స్పందించిన మాధవ.. ప్రయాణికులు చేయి ఎత్తిన చోట ఎక్కించుకుని, వారు కోరిన చోట దించేలా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
రాజమహేంద్రవరం నుంచి వయా చక్రద్వారబంధం మీదుగా రామచంద్రాపురం వెళ్లే బస్సు సర్వీసును ఏర్పాటు చేయాలని కొందరు కోరారు. దీనిపై డీఎం స్పందిస్తూ.. కొత్త బస్సులు వచ్చాక తుంగపాడు మీదుగా ఆ బస్సు సర్వీసును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇవే కాక.. ద్వారపూడి గ్రామంలోకి అద్దె బస్సులు తిప్పేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బస్టాండులో బస్సుల టైమింగ్స్ డిస్ప్లే ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీటితో పాటుగా పండుగల సమయంలో ద్వారపూడి నుంచి హైదరాబాద్కు ప్రత్యేకంగా బస్సులు నడపాలని వచ్చిన విన్నపంపై కూడా ఆయన సానుకూలంగా స్పందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa