గత నెల అనగా సెప్టెంబర్ వరకు కూడా ఏపీలోని గుంటూరు జిల్లా, తురకపాలెం గ్రామంలో వరుస మరణాలు.. సంచలనం సృష్టించాయి. నాలుగు నెలల వ్యవధిలో పదుల సంఖ్యలో జనాలు ప్రాణాలు విడిచారు. ఈ మిస్టరీ మరణాల వల్ల పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గ్రామ ప్రజల మరణాలకు అత్యంత అరుదైన మెలియోడోసిస్ వ్యాధి కారణమని గుర్తించారు. మెలిన్ అనే బ్యాక్టీరియా వల్ల.. తురకపాలెం ప్రజలు జ్వరాల బారిన పడి మరణించినట్లు నిపుణులు గుర్తించారు.
గ్రామంలో వరుస మరణాలు చోటు చేసుకోవడంతో.. గుంటూరు జీజీహెచ్, గుంటూరు మెడికల్ కాలేజీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యులు, ఇతర నిపుణులు గ్రామానికి వచ్చి పదుల సంఖ్యలో పరీక్షలు నిర్వహించిన తర్వత మరణాల మిస్టరీ వీడింది. ఈక్రమంలో తురకపాలెం మృతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఆ వివరాలు..
గుంటూరు జిల్లా, తురకపాలెంలో.. మెలియాయిడోసిస్ వ్యాధి లక్షణాలతో చనిపోయిన బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది. వారికి ఆర్థిక సాయం ప్రకటించింది. చనిపోయిన వారిలో చాలా మంది పేదవారే ఉండటంతో.. బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని విన్నవించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరారు.
పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన అభ్యర్థనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. దీంతో తురకపాలెంమృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేయడానికి ఆమోదం తెలిపారు. దీంతో గ్రామంలో చనిపోయిన మొత్తం 28 మంది కుటుంబాలన్నింటికి కలిపి.. రూ. కోటి 40 లక్షలను మంజూరు చేసింది ప్రభుత్వం. నేడు అనగా ఆదివారం కేంద్ర మంత్రి పెమ్మసానితో పాటు ఎమ్మెల్యే రామాంజనేయులు తురకపాలెం గ్రామానికి వచ్చి చనిపోయిన వారి కుటుంబాలకు ఈ ఆర్థికసాయం అందజేయనున్నారు.
దాదాపు 3 వేల జనాభా ఉన్న పల్నాడు జిల్లా, తురకపాలెం గ్రామంలో గత నాలుగు నెలల వ్యవధిలోనే.. 28 మంది చనిపోయారని.. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. జులై, ఆగస్టు రెండు నెలల్లోనే 20 మంది వరకు చనిపోయారు. వరుస మరణాలు గ్రామస్థులను భయపెట్టాయి. ఈక్రమంలో గ్రామంలో నిర్వహించిన పలు పరీక్షలు, పరిశోధనల అనంతరం.. మరణించిన వారంతా అతి ప్రమాదకరమైన ‘మెలియాయిడోసిస్’ అనే ఇన్ఫెక్షన్తో బాధపడి చనిపోయినట్లు తెలిపారు. మెలిన్ అనే బ్యాక్టీరియా వల్లే ఈ మరణాలు చోటుచేసుకుంటున్నాయని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించడమే కాక.. స్వయంగా ప్రభుత్వమే గ్రామస్థులకు స్వయంగా ప్రభుత్వమే ఆహారం, తాగునీరు అందజేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa