ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఏపీ ఎక్సైజ్ సురక్ష' యాప్ ఆవిష్కరణ లిక్కర్ బాటిల్ లేబుల్‌ను స్కాన్ చేస్తే పూర్తి వివరాలు వెల్లడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 12, 2025, 09:58 PM

ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ, కల్తీ మద్యానికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. వినియోగదారులు కొనుగోలు చేస్తున్న మద్యం అసలుదో, నకిలీదో సులభంగా గుర్తించేందుకు వీలుగా 'ఏపీ ఎక్సైజ్ సురక్ష' పేరుతో ఓ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం ఉండవల్లిలోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ యాప్‌ను ఆవిష్కరించారు. ఇటీవల ములకలచెరువులో వెలుగుచూసిన నకిలీ మద్యం ఘటన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు.ఈ యాప్ ద్వారా మద్యం ప్రియులు తాము కొంటున్న బాటిల్ నాణ్యతను క్షణాల్లో తెలుసుకోవచ్చని చంద్రబాబు వివరించారు. మద్యం బాటిల్‌పై ఉన్న లేబుల్‌ను ఈ యాప్‌తో స్కాన్ చేయగానే, ఆ ఉత్పత్తికి సంబంధించిన పూర్తి వివరాలు తెరపై కనిపిస్తాయని తెలిపారు. బాటిల్ సీల్, ఎమ్మార్పీ, బ్యాచ్ నంబర్, ఏ డిస్టిలరీలో తయారైంది, తయారీ తేదీ వంటి సమాచారం స్పష్టంగా కనిపిస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఒకవేళ స్కాన్ చేసినప్పుడు 'ఇన్ వాలిడ్' అని వస్తే, ఆ మద్యం బాటిల్ నకిలీదని సులభంగా గుర్తించవచ్చని ఆయన తెలిపారు.ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉందని, ప్రతి ఒక్కరూ దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. భవిష్యత్తులో ఈ యాప్‌ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఇకపై రాష్ట్రంలో నకిలీ మద్యానికి ఆస్కారం లేకుండా, ప్రజలను మోసం చేసేందుకు వీల్లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు చేశారు. కల్తీ మద్యం అనేది గత వైసీపీ ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన సమస్య అని ఆయన ఆరోపించారు. తమ హయాంలో ఇలాంటి మోసాలకు తావులేకుండా పారదర్శకమైన విధానాలను అమలు చేస్తామని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa