ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల ముందు.. లాలూ కుటుంబానికి కోర్టు షాక్

national |  Suryaa Desk  | Published : Mon, Oct 13, 2025, 07:40 PM

బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని వారాల ముందు ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి షాక్ తగిలింది. లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు ఆయన భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, కుమారుడు తేజస్వి యాదవ్‌పై.. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అవినీతి అభియోగాలు నమోదు చేసింది. మోసం, నేరపూరిత కుట్రకు సంబంధించిన సెక్షన్ల కింద, అలాగే అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు మోపింది. కానీ లాలూ కుటుంబం మాత్రం తాము నిర్దోషులమని, ఇది తప్పుడు కేసు అని వాదిస్తోంది.


2004 నుంచి 2009 వరకు లాలూ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న కాలంలో IRCTC హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టుల కేటాయింపులో అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. రెండు IRCTC హోటళ్లు.. BNR రాంచీ, BNR పూరీ నిర్వహణ కాంట్రాక్టును.. సుజాత హోటల్‌కు అప్పగించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఒప్పందానికి ప్రతిఫలంగా లాలూ యాదవ్‌.. తనకు సంబంధించిన ఒక బినామీ కంపెనీ ద్వారా మూడు ఎకరాల భూమిని తక్కువ ధరకు పొందారని సీబీఐ ఆరోపించింది.


ఈ ఆరోపణలకు సంబంధించి 2017లో లాలూ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. తాజాగా వారిపై అభియోగాలు మోపడానికి సరైన ఆధారాలు ఉన్నాయని సీబీఐ కోర్టుకు తెలిపింది. కానీ లాలూ తరఫు న్యాయవాది మాత్రం.. అభియోగాలు నమోదు చేయాడానికి ఎలాంటి ఆధారాలు లేవని.. హోటల్ టెండర్లు పారదర్శకంగా జరిగాయని వాదించారు.


విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో జరిగిన మోసాన్ని విచారించాలని చెప్పింది. రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగిందని పేర్కొంది. ఎలాంటి కుట్ర అయినా.. కోర్టు దృష్టి నుంచి దాచడం కుదరదని వెల్లడించింది. దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం.. లాలూ యాదవ్ ఇతర నిందితులతో కుట్ర పన్నారని, పదవిని దుర్వినియోగం చేశారని అర్థమవుతోందని కోర్టు చెప్పింది. తక్కువ విలువతో భూమి కొనుగోలు చేసినందుకు.. ప్రతిఫలంగా టెండర్లు జారీ చేసి.. ఆ ప్రక్రియను ప్రభావితం చేశారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని కోర్టు పేర్కొంది.


ఈ వ్యవహారం త్వరలో జరగబోయే బిహార్ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ)కు సమస్యగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే తేజస్వి యాదవ్ సీఎం ఫేస్‌గా ఉన్నారు. దీంతో అధికార ఎన్డీఏ కూటమి నేతలు.. దీన్ని ఆస్త్రంగా మలచుకుని అవినీతి ఆరోపణలు గుప్పించే అవకాశాలు ఉన్నాయి. అయితే దీని వల్ల ఆర్జేడీ ఓటు బ్యాంకుకు ఏ మేర గండి పడుతుందో వేచి చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa