ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ట్రంప్‌కే.

international |  Suryaa Desk  | Published : Mon, Oct 13, 2025, 07:55 PM

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం ఎంతగా తహతహలాడారో అందరికీ తెలిసిందే. ఏడు యుద్ధాలు ఆపానంటూ పదే పదే ప్రకటించినా.. ఆయన్ను మాత్రం నోబెల్ బహుమతి వరించలేదు. అయినా అవేమీ పట్టించుకోని ఆయన ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధాన్ని ఆపారు. ఈక్రమంలోనే ఇజ్రాయెల్ ఆయన కృషిని గుర్తించి.. తమ దేశ అత్యున్నత పౌరస పురస్కారమైన 'ప్రెసిడెన్షియల్ మెడిల్ ఆఫ్ ఆనర్'ను అమెరికా అధ్యక్షుడికి ప్రదానం చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని నేరుగా ఆ దేశ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌యే వెల్లడించారు.


అవిశ్రాంత ప్రయత్నాల ద్వారా అధ్యక్షుడు ట్రంప్ తమ ప్రియమైన వారిని (బందీలను) ఇంటికి తీసుకురావడానికి ఎంతగానో సహాయ పడ్డారని గుర్తు చేశారు. అలాగే భద్రత, సహకారం, శాంతియుత భవిష్యత్తును సాధించడం కోసం చేసిన కృషికి గాను ఈ గౌరవాన్ని అందుకోవడానికి ట్రంప్ అర్హుడు అంటూ హెర్జోగ్ ఓ ప్రకటనలో తెలిపారు. ట్రంప్‌నకు ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్ అందించడం తనకు గొప్ప గౌరవం అని వివరించారు. ఇజ్రాయెల్‌కు ట్రంప్ ఇచ్చిన అచంచలమైన మద్దతు, దేశ పౌరుల భద్రత, శ్రేయస్సు కోసం ఆయన నెలకొల్పిన శాంతిని ఈ విధంగా తాము గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు.


ఈ అవార్డును సాధారణంగా ఇజ్రాయెల్ దేశ ప్రజలకు లేదా మానవత్వానికి అత్యుత్తమ సేవలు అందించిన వ్యక్తులకు అందిస్తారు. 2013లో ఇజ్రాయెల్ భద్రత మరియు సంబంధాలను బలోపేతం చేసినందుకు గాను అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బరాక్ ఒబామా ఈ పతకాన్ని అందుకున్న మొదటి వ్యక్తిగా నిలిచారు. ట్రంప్ సోమవారం ఇజ్రాయెల్‌కు చేరుకోనున్నారు. అక్కడికి వెళ్లాకే ఆయనకు అవార్డు గురించి అధికారికంగా తెలియజేయబోతున్నట్లు కూడా ఇజ్రాయెల్ అధ్యక్షుడు వివరించారు. అయితే మెడల్‌ను లాంఛనంగా వచ్చే నెలల్లో అందజేయనున్నట్లు స్పష్టం చేశారు. ట్రంప్ చేసిన సహాయాన్ని ఇజ్రాయెల్ ప్రజలు తరతరాల పాటు గుర్తుంచుకుంటారన్నారు.


తన నాలుగు గంటల పర్యటనలో ట్రంప్ ఇజ్రాయెల్ పార్లమెంటు అయిన నెసెట్‌ను ఉద్దేశించి మాట్లాడతారు. ఆ తర్వాత బందీల కుటుంబాలను కలవనున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ట్రంప్ రూపొందించిన 21 సూత్రాల గాజా శాంతి ప్రణాళికకు గత వారం ఇజ్రాయెల్, హమాస్ రెండు పక్షాలు అంగీకరించాయి. ఇలా ఈ యుద్ధం ముగింపుకు మొదటి అడుగు పడింది. అయితే దీని గురించి నేరుగా ట్రంప్‌యే మాట్లాడుతూ.. ఇజ్రాయెల్-హమాస్ మధ్య చేసిన కాల్పుల విరమణ ఒప్పందమే తాను ఇప్పటి వరకు చేసిన అతిపెద్ద ఒప్పందం అని తెలిపారు. ఇటీవలే ఇరాన్‌పై చేసిన దాడుల వల్ల హమాస్‌ను బలహీనపరిచగలిగామని.. ఆ దాడుల వల్లే శాంతి ఒప్పంద చేసుకోవడానికి మార్గం సుగమం అయిందని ట్రంప్ వెల్లడించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa