అంతర్జాతీయంగా నెలకొన్న వాణిజ్య సవాళ్లను అధిగమిస్తూ భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి భారత్కు శుభవార్త చెప్పింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను భారత జీడీపీ వృద్ధి అంచనాను 6.4 శాతం నుంచి 6.6 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. భారత ఎగుమతులపై అమెరికా భారీ సుంకాలను విధించినప్పటికీ, దేశీయంగా బలమైన పనితీరు కారణంగా ఈ అంచనాను సవరించినట్లు తన 'వరల్డ్ ఎకనమిక్ ఔట్లుక్' నివేదికలో స్పష్టం చేసింది.2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం వృద్ధిని నమోదు చేసిందని, గత ఏడాది కాలంలో ఇదే అత్యధికమని ఐఎంఎఫ్ గుర్తు చేసింది. ముఖ్యంగా దేశంలో ప్రైవేటు వినియోగం బలంగా ఉండటమే ఈ వృద్ధికి ఊతమిచ్చిందని తెలిపింది. ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణల ద్వారా వినియోగ వస్తువులపై పన్నులను తగ్గించడంతో దేశీయ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని, ఇది అమెరికా సుంకాల ప్రభావాన్ని అధిగమించడానికి సహాయపడుతుందని నివేదికలో పేర్కొంది.ఇటీవలే ప్రపంచ బ్యాంకు సైతం భారత వృద్ధి అంచనాను 6.3 శాతం నుంచి 6.5 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఐఎంఎఫ్ కూడా అదే బాటలో పయనించడం భారత ఆర్థిక వ్యవస్థ పటిష్ఠతను సూచిస్తోంది.ఈ సందర్భంగా ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జియేవా భారత్పై ప్రశంసలు కురిపించారు. మారుతున్న ప్రపంచ ఆర్థిక క్రమంలో చైనా వృద్ధి నెమ్మదిస్తుండగా, భారత్ ప్రపంచానికి కీలకమైన వృద్ధి ఇంజిన్గా అభివృద్ధి చెందుతోందని ఆమె కొనియాడారు. అయితే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంకా పూర్తిగా గడ్డు పరిస్థితుల నుంచి బయటపడలేదని, రాబోయే రోజుల్లో సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు. వర్ధమాన దేశాల వృద్ధి రేటు 2026 నాటికి 4 శాతానికి పరిమితం కావచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa