ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలోనే అత్యంత ఖరీదైన స్వీట్.. 24 క్యారెట్ల బంగారం పొడితో చేసిన మిఠాయి

national |  Suryaa Desk  | Published : Sat, Oct 18, 2025, 08:19 PM

దీపావళి పండగ సీజన్‌ను పురస్కరించుకుని జైపూర్‌లోని ఒక స్వీట్ షాప్ భారతదేశంలోనే అత్యంత ఖరీదైన స్వీట్‌ను తయారు చేసింది. దాని ధర తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఆ స్వీట్ పేరు స్వర్ణ ప్రసాదం. పేరులోనే స్వర్ణం అని పెట్టుకున్న ఆ స్వీట్‌ను బంగారంతోనే తయారు చేశారు. అది కూడా 24 క్యారెట్ల మేలిమి బంగారం. ఈ ప్రత్యేకమైన మిఠాయి ధర అక్షరాలా ఒక లక్ష 11 వేల రూపాయలు (రూ.1,11,000). ఈ స్వీట్‌లో ఉపయోగించిన బంంగారం, ఇతర అత్యంత నాణ్యమైన పదార్థాల వల్ల దీని ధర లక్ష రూపాయలు దాటినట్లు షాప్ యజమాని తెలిపారు.


ఈ స్వీట్‌ను తయారు చేయడానికి ముఖ్యంగా 24 క్యారెట్ల తినదగిన బంగారాన్ని ఉపయోగించారు. 'స్వర్ణ భస్మం' లేదా 'గోల్డ్ యాషెస్' అని పిలిచే పదార్థాన్ని ఇందులో కలిపారు. ఈ గోల్డ్ యాష్‌ను భారతీయ ఆయుర్వేద పద్ధతుల నుండి తీసుకున్నామని, ఇది భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమని షాప్ యజమాని అంజలి జైన్ తెలిపారు. ఈ స్వీట్‌ను 'అల్ట్రా ప్రీమియం'గా మార్చడానికి పలు ప్రత్యేకమైన, ఖరీదైన పదార్థాలను వినియోగించినట్లు అంజలి జైన్ చెప్పుకొచ్చారు. అత్యంత ఖరీదైన, ప్రీమియం డ్రైఫ్రూట్‌లలో ఒకటైన చిల్గోజా(పైన్ నట్స్)ను ఈ స్వీట్ తయారీకి ఉపయోగించారు.


ఈ స్వీట్‌పై అలంకరణ కోసం జైన్ దేవాలయం నుంచి కొన్న 'యానిమల్ క్రుయల్టీ-ఫ్రీ' 24 క్యారెట్ గోల్డ్ ఫాయిల్ ఉపయోగించారు. అలాగే ఈ స్వీట్‌పై జైన గోల్డ్ వర్క్ అప్లై చేస్తున్నారు. ఈ స్వీట్‌కు కేసరి (సాఫ్రాన్)తో పూత పూసి, పైన పైన్ నట్స్ ముక్కలతో అలంకరిస్తున్నారు. ఈ స్వీట్ ప్యాకేజింగ్‌లో కూడా ప్రత్యేకంగా ఉండేలా చూసుకున్నారు. దీనిని ఒక సాధారణ స్వీట్ బాక్స్‌లో కాకుండా, అత్యంత నాణ్యతతో కూడిన ప్రీమియం జ్యువెలరీ బాక్స్‌లో ప్యాక్ చేసి వినియోగదారులకు అందిస్తున్నారు. దీని ప్యాకేజింగ్ కూడా ఈ స్వీట్‌కు ప్రత్యేకమైన లగ్జరీ లుక్‌ను తీసుకొస్తోంది.


ఈ దుకాణంలో 'స్వర్ణ ప్రసాదం'తో పాటు 24 క్యారెట్ల బంగారాన్ని ఉపయోగించి తయారుచేసిన ఇతర ఖరీదైన ఇతర స్వీట్లు కూడా ఉన్నాయి. పిస్తా లౌంజ్ కేజీ ధర రూ. 7 వేలు, కాజు కట్లి - రూ. 3,500/కిలో, లడ్డూలు - రూ. 2,500/కిలో, రసమలై సహా ఇతర ప్రీమియం స్వీట్లను అమ్ముతున్నారు. పండగ సీజన్‌లలో ధనవంతులు మాత్రమే కొనే స్వర్ణ ప్రసాదం ఈ షాపు ప్రత్యేకత అని షాప్ యజమాని అంజలి జైన్ తెలిపారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa