ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'పాకిస్థాన్ భూభాగమంతా మా రేంజ్‌లోనే': రాజ్‌నాథ్ సింగ్

national |  Suryaa Desk  | Published : Sat, Oct 18, 2025, 08:22 PM

భారత రక్షణ రంగం సరికొత్త మైలురాయిని చేరుకుంది. అత్యంత శక్తివంతమైన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్షిపణి వ్యవస్థ తొలి బ్యాచ్‌ను ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో విజయవంతంగా ఉత్పత్తి చేశారు. వాటిని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ భారత సైన్యానికి అప్పగించారు. ఈ సందర్భంగా సైన్యం పరాక్రమం, సంసిద్ధతను ప్రశంసిస్తూ.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పొరుగుదేశం పాకిస్థాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.


పాకిస్థాన్‌లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ క్షిపణి రేంజ్‌లోనే ఉందని రాజ్‌నాథ్‌ సింగ్ హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ ట్రైలర్ మాత్రమేనన్న కేంద్ర మంత్రి.. ప్రత్యర్థులు ఇకపై బ్రహ్మోస్ నుంచి తప్పించుకోలేరని అన్నారు. బ్రహ్మోస్ క్షిపణుల ప్రాముఖ్యతను వివరిస్తూ.. "ఇది కేవలం ఒక క్షిపణి మాత్రమే కాదు, భారతదేశ సామర్థ్యానికి ప్రతీక. వేగం, కచ్చితత్వం, శక్తి అనే మూడు లక్షణాలతో బ్రహ్మోస్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ క్షిపణుల్లో ఒకటిగా నిలిచింది. బ్రహ్మోస్ మన సైన్యం, నౌకాదళం, వైమానిక దళాలకు వెన్నెముకగా మారింది." అని కొనియాడారు.


‘ఆపరేషన్ సిందూర్’ భారతదేశ సామర్థ్యానికి నిదర్శనంగా నిలిచిందన్న కేంద్ర మంత్రి.. భారత్‌కు గెలుపు అలవాటుగా మారిందన్నారు. సిందూర్ సమయంలో బ్రహ్మోస్ కేవలం ఒక వ్యవస్థగానే కాకుండా మన దేశ భద్రతకు రుజువుగా నిలిచిందని వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్‌ కేవలం ట్రైలర్ మాత్రమేనని ఆ ట్రైలర్ చూసే పాకిస్థాన్‌కు భారత శక్తి సామర్థ్యాలు అర్థమయ్యాయని చెప్పుకొచ్చారు.


ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్‌ను ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ సింగ్ సందర్శించారు. ఈ నూతన ఇంటిగ్రేషన్, టెస్ట్ ఫెసిలిటీలో మిస్సైల్ కనెక్షన్, టెస్ట్, క్వాలిటీ కంట్రోల్‌లకు అవసరమైన అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఈ ఏడాది మే 11న ఈ యూనిట్‌ను ప్రారంభించారు. ఈ యూనిట్ నుంచి విజయవంతంగా క్షిపణులను ఉత్పత్తి చేయడం ద్వారా కీలక మైలురాయిని చేరుకుంది భారత్.


ఇక్కడి బ్రహ్మోస్ బృందం ఒక నెలలోనే రెండు దేశాలతో రూ.4 వేల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకుంది. రానున్న రోజుల్లో ఇతర దేశాల నుంచి నిపుణులు లక్నోకు తరలివస్తారని, అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ యూనిట్ టర్నోవర్ రూ.3 వేల కోట్లు అవుతుందని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ప్రతి ఏటా రూ.5 వేల కోట్ల మేర జీఎస్టీ వసూలు అవుతుందని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa