ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దీపావళి గిఫ్ట్‌గా చికెన్ మసాలా.. ఆలయ ఉద్యోగులకు అసాధారణ బహుమతి

national |  Suryaa Desk  | Published : Sat, Oct 18, 2025, 08:23 PM

దీపావళి పండుగ సందడి దేశవ్యాప్తంగా మొదలైంది. ఈ సందర్భంగానే అనేక కంపెనీలు తమ వద్ద పని చేసే ఉద్యోగులు, కార్మికులకు అదిరిపోయే బహుమతులు అందజేస్తున్నారు. తమ స్తోమతకు తగ్గట్లుగా స్వీట్లు, మిఠాయిల నుంచి పెద్ద పెద్ద కార్లు, బంగ్లాలు, బంగారం వరకు అనేక రకాల బహుమతులు ఇస్తూ సర్‌ప్రైజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మనమూ ఇలాంటివి అందుకున్నాం. చూశాం. కానీ మనం ఇప్పుడు చూడబోయే చోట మాత్రం ఎవరూ ఊహించని బహుమతి ఇచ్చారు. ముఖ్యంగా గుడిలో పని చేసే ఉద్యోగులకు.. అది కూడా శాఖాహారం మాత్రమే నడిచే ఆలయంలో పని చేసే కార్మికులకు.. ఏకంగా చికెన్ మసాలాను బహుమతిగా ఇచ్చి షాక్ ఇచ్చారు. మరి ఈ ఘటన ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.


మహారాష్ట్రలోని పండరీపూర్ పుణ్యక్షేత్రంలో ఉన్న ప్రఖ్యాత విఠల్ ఆలయంలో ఉద్యోగులకు దీపావళి సందర్భగా బహుమతులు అందజేశారు. ఆలయ అధికారుల నుంచి దీపావళి కానుకగా అందుకున్న ఆ బహుమతి.. ఆ ఆలయంలో పనిచేసే ఉద్యోగులందరినీ తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా విఠల్ ఆలయంలోని సెక్యూరిటీ గార్డులు, ఇతర పర్మినెంట్ ఉద్యోగులు, అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి అధికారులు పంచి ఇచ్చింది మరేదో కాదు.. చికెన్ మసాలా ప్యాకెట్లు.


  సాక్షాత్తూ హిందువులకు అత్యంత పవిత్రమైన విఠలుడి ఆలయంతో సంబంధం ఉన్న ఉద్యోగులకు.. పవిత్రమైన పండుగ సందర్భంగా మాంసాహారం వండుకోవడానికి ఉపయోగించే మసాలా ప్యాకెట్లను ఇవ్వడం వింతగా మారింది. పండరీపూర్ వంటి భక్తిశ్రద్ధలకు నెలవైన చోట, శాఖాహార పవిత్రతకు ప్రాధాన్యత ఉండే ఆలయంలోని ఉద్యోగులకు ఇలాంటి అసాధారణమైన బహుమతి ఇవ్వడానికి గల కారణం ఏంటని అంతా ప్రశ్నిస్తున్నారు. అసలు ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారని తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.


సాధారణంగా ఆలయాల నుంచి ఉద్యోగులు పండ్లు, కొబ్బరికాయలు, పూజా సామగ్రి లేదా నగదు బహుమతులు అందుకోవడం చూస్తుంటాం. కానీ చికెన్ మసాలా ప్యాకెట్లు అందించడం అనేది ఆలయ సంప్రదాయాలకు, పండుగ పవిత్రతకు విరుద్ధమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. కొందరు ఉద్యోగులకు వారి వ్యక్తిగత అభిరుచులను బట్టి బహుమతులు ఇవ్వడం సరైనదే అని సమర్థిస్తుండగా.. మరికొందరు మాత్రం ఆలయ పవిత్రతను దృష్టిలో ఉంచుకొని అధికారులు ఈ నిర్ణయంపై పునరాలోచించాలని కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa