ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు.. ప్రభుత్వ ఉద్యోగి సస్పెండ్

national |  Suryaa Desk  | Published : Sat, Oct 18, 2025, 08:27 PM

కర్ణాటక రాష్ట్రంలో మరో రాజకీయ వివాదం రాజుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ స్థలాల్లో ఆర్‌ఎస్‌ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) కార్యకలాపాలను పరిమితం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలను తీసుకు వచ్చిన కొద్ది రోజులకే.. ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమంలో పాల్గొన్న ఒక పంచాయతీ అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సిర్వార్ తాలూకా పంచాయతీ అభివృద్ధి అధికారి ప్రవీణ్ కుమార్ అక్టోబర్ 12వ తేదీన లింగసుగూర్‌లో జరిగిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ యూనిఫాం ధరించి.. కర్ర చేత పట్టుకుని రూట్ ఊరేగింపులో కవాతు చేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఉన్నతాధికారులు చూసి ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.


రాయచూరు జిల్లాలోని సిర్వార్ తాలూకాకు చెందిన పంచాయతీ అభివృద్ధి అధికారి ప్రవీణ్ కుమార్ కేపీని గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీ రాజ్ శాఖ శుక్రవారం సస్పెండ్ చేసింది. అక్టోబర్ 12న లింగసూగూర్‌లో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో జరిగిన రూట్ మార్చ్‌లో.. ఆయన ఆ సంస్థ యూనిఫాం ధరించారు. అంతటితో ఆగకుండా చేతిలో కర్రతో కూడా పట్టుకున్న వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ కాగా వాటిని చూసిన పైఅధికారులు అతడిని సస్పెండ్ చేశారు.


ఐఏఎస్ అధికారిణి అరుంధతి చంద్రశేఖర్ జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులో.. అధికారి చర్యలు సివిల్ సర్వీస్ ప్రవర్తనా నియమాలను ఉల్లంఘించాయని స్పష్టం చేశారు. దీనిపై శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశించారు. తదుపరి నోటీసు వచ్చే వరకు ఆయన సస్పెన్షన్‌లోనే ఉంటారని.. ఆయనకు జీవనాధార భత్యం కూడా చెల్లిస్తామన్నారు. ప్రవీణ్ కుమార్ లింగసుగూర్ ఎమ్మెల్యే మనప్ప వజ్జల్ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా కూడా పని చేస్తున్నాడు.


కర్ణాటక ప్రభుత్వ మైదానాలు, ఉద్వాన వనాలు, పాఠశాలల ఆవరణలు, క్రీడా మందిరాల్లో ఆర్ఎస్ఎస్ శాఖలు, భైఠక్, సాంఘిక్ పేరిట కార్యక్రమాల నిర్వహణపై నిషేధం విధించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కోరారు. ప్రజల ఆలోచనల్లో విషబీజాలను నాటే శక్తులను నియంత్రించకపోతే లౌకికవాదంతో పాటు రాజ్యాంగానికి ముప్పు ఏర్పడుతుందని చెప్పారు. ఈ నేపథ్యంతోనే అన్ని ప్రభుత్వ ప్రాంగణాల్లో ఇలాంటి సంస్థలు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకూడదని ఆదేశాలు జారీ చేసింది. కాగా కర్ణాటక ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగిపై సస్పెన్షన్ విధించడంపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సస్పెన్షన్‌ను తక్షణమే ఉపసంహరించుకుని.. సదరు ఉద్యోగికి క్షమాపణ చెప్పాలని కోరారు. లేదంటే ఈ విభజన రాజకీయాలను ఎదుర్కోవడానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగ బద్ధమైన మార్గాల ద్వారా సరైన జవాబు ఇస్తామని గట్టిగా హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa