ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌లో భారీగా మంటలు.. తప్పిన పెనుప్రమాదం

national |  Suryaa Desk  | Published : Sat, Oct 18, 2025, 08:28 PM

 పంజాబ్‌లోని సిర్హింద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈరోజు ఉదయం జరిగిన ఓ పెను ప్రమాదం తృటిలో తప్పింది. అమృత్‌సర్ నుంచి సహర్సా వైపు వెళ్తున్న గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రైలు నెంబర్ 12204 బోగీ నంబర్ 19లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా పెద్ద ఎత్తున పొగలు, మంటలు రావడంతో ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే విషయాన్ని రైల్వే అధికారులకు తెలిపారు. అప్రమత్తమైన వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఇలా అంతా హుటాహుటిన రైలు వద్దకు చేరుకోని సహాయక చర్యలు చేపట్టారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ముఖ్యంగా ప్రయాణికులు అంతా సురక్షితంగా బయటపడ్డారు.


సిర్హింద్ రైల్వే స్టేషన్ దాటిన రైలు.. అంబాలాకు సుమారు అర కిలోమీటరు దూరంలో ఉండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. రైలు కదులుతున్న సమయంలోనే ఒక బోగీ నుంచి దట్టమైన పొగ రావడాన్ని ప్రయాణికులు గమనించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అత్యవసరంగా రైలును నిలిపివేశారు. ఈక్రమంలోనే మంటలు వ్యాపించిన కోచ్‌లోని ప్రయాణికులను మిగతా బోగీలకు, ఆ తరువాత సురక్షిత ప్రాంతానికి తరలించారు. స్థానిక అగ్నిమాపక దళాలు సైతం వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకు రావడానికి కృషి చేశాయి.


ఈ సంఘటనపై సిర్హింద్ ప్రభుత్వ రైల్వే పోలీసులు స్పందిస్తూ.. 'ఏ విధమైన ప్రాణనష్టం జరగలేదు' అని ధృవీకరించారు. సిర్హింద్ జీఆర్‌పీ SHO రతన్ లాల్ తెలిపిన వివరాల ప్రకారం.. బోగీలో పొగ, మంటలు గమనించగానే ప్రయాణికులను తక్షణమే అప్రమత్తం చేసి.. వేగంగా బోగీల నుంచి తరలించామన్నారు. సమయానికి అందరినీ తరలించగలిగాం కాబట్టే ఎలాంటి ప్రాణనష్టం సభవించలేదన్నారు. ఈ అగ్నిప్రమాదంలో రైలులోని మూడు బోగీలు దెబ్బతిన్నట్లు అధికారులు ధృవీకరించారు. వీటిలో ఒకటి తీవ్రంగా కాలిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ప్రాథమికంగా పరిశీలించినప్పుడు మాత్రం షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.


ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు కొంత అంతరాయం కలిగినప్పటికీ.. దెబ్బతిన్న బోగీలను మిగతా రైలు నుంచి వేరు చేసి, త్వరలోనే రైలును తిరిగి తన గమ్యస్థానం వైపు ప్రయాణించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాణికులకు తాత్కాలికంగా వేరే బోగీలలో వసతి కల్పించి, రైలు సేవలను పునరుద్ధరించడానికి రైల్వే అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు ప్రారంభించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa