బీఎండబ్ల్యూ, ఆడి, మెర్సిడెజ్ బెంజ్ వంటి 186 వంటి లగ్జరీ కార్లను కొనుగోలు చేసిన ప్రముఖ జైన్ కమ్యూనిటీ .. ఏకంగా రూ.21 కోట్ల డిస్కౌంట్ పొందింది. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ( జేఐటీఓ ) చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఈ డిస్కౌంట్ సాధ్యమైంది. దేశవ్యాప్తంగా 65 వేల మంది సభ్యులు కలిగి జేఐటీఓ భారతీయ జైన కమ్యూనిటీ ఆర్థిక శక్తిని మరోసారి చాటిచెప్పింది. జైఐటీఓ ఉపాధ్యక్షుడు హిమాంశు షా మాట్లాడుతూ.. విలాసవంతమైన బ్రాండ్లతో చేసుకున్న ఓ ప్రత్యేక ఒప్పందంలో భాగమే ఈ డిస్కౌంట్ అని తెలిపారు. బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన 15 మంది డీలర్లతో చర్చలు జరిపి, తమ సభ్యులకు మరింత అనుకూలమైన ధరలకు కార్లను అందించామని వివరించారు.
ఈ వ్యవహారంలో తమ కమ్యూనిటీ కేవలం మధ్యవర్తిగా వ్యవహరించిందని, ఇందులో ఎటువంటి లబ్ది పొందలేదని ఆయన తెలిపారు. ఇందులో ఎక్కువ శాతం కార్లను గుజరాత్కు చెందిన జైనులే కొనుగోలు చేశారని ఆయన చెప్పారు. ఈ కార్ల ధర రూ.60 లక్షల నుంచి రూ.1.3 కోట్ల వరకు ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య కొనుగోలుదారులకు ఈ కార్లను అందజేశారు. ‘దీని వల్ల మా సభ్యులకు రూ.21 కోట్ల మేర ఆదా అయ్యింది’ అని షా పేర్కొన్నారు. నితిన్ జైన్ అనే తమ కమ్యూనిటీ సభ్యుడు దీనికి ప్రేరణగా నిలిచారని అన్నారు.
కొంతమంది JITO సభ్యులు తమ సామూహిక కొనుగోలు శక్తి వల్ల పెద్ద ఎత్తున డిస్కౌంట్ పొందవచ్చని సూచించడంతో దీనికి శ్రీకారం చుట్టామని తెలిపారు.ప్రకటన ఖర్చులు లేకపోవడంతో కార్ల తయారీదారులకూ ఇది లాభదాయకంగా మారిందని నితిన్ జైన్ వివరించారు. ‘‘తొలుత కొద్దిమంది మాత్రమే పాల్గొన్నారు. అయితే భారీ డిస్కౌంట్ విషయం తెలిసి, మరింత మంది ముందుకొచ్చారు... మొత్తంగా 186 కార్లు కొనుగోలు చేయగా, రూ.21 కోట్లు ఆదా అయ్యాయి. సగటున ప్రతి సభ్యుడు రూ.8 లక్షల నుంచి రూ.17 లక్షల వరకు ఆదా చేసుకున్నారు.. అది కుటుంబ సభ్యుడికి మరో కారు కొనేందుకు సరిపడేంత మొత్తమే’’ అని జైన్ తెలిపారు. ఇదే తరహాలో ఆభరణాలు, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో కూడా ఇలాంటి సమూహిక డీల్స్ను విస్తరించేందుకు ‘ఉత్సవ్’ అనే కొత్త కార్యక్రమాన్ని జేఐటీఓ ప్రారంభిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa