ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాడిన డిస్పోజబుల్ ఫుడ్ కంటైనర్లను తిరిగి వాడటానికి కడిగిన వ్యక్తి!,,,షాక్‌కు గురి చేస్తున్న వీడియో

national |  Suryaa Desk  | Published : Sun, Oct 19, 2025, 07:46 PM

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో రైల్వే ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తోంది. ఇంకోసారి ట్రైన్‍లో ఆహారం తినాలంటేనే వాంతి చేసుకునేలా చేస్తోంది. ఆ వీడియోలో ఒక వ్యక్తి.. ప్యాసింజర్ కంపార్ట్‌మెంట్ లోపల ఉపయోగించిన డిస్పోజబుల్ ఫుడ్ కంటైనర్లను.. మళ్లీ ఉపయోగించేందుకు కడుగుతున్నట్లు కనిపించింది. తీవ్ర కలకలం రేపిన ఈ వీడియో.. భారతీయ రైళ్లలో పరిశుభ్రత ప్రమాణాల గురించి అనేక ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ప్రయాణికులు దీనిపై తీవ్రంగా మండిపడుతున్నారు. కాగా ఈ ఘటనపై రైళ్లలో క్యాటరింగ్ సేవలు అందించే ఐఆర్‌సీటీసీ స్పందించింది.


ఈరోడ్ (తమిళనాడు)- జోగ్బానీ (బిహార్) మధ్య నడిచే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 16601)లో ట్రైన్‌లో ఇటీవలి ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఓ ప్రయాణికుడు రికార్డ్ చేసిన వీడియోలో.. రైల్వే క్యాంటీన్ సిబ్బందిగా భావిస్తున్న వ్యక్తి.. ప్యాసింజర్లకు ఆహారాన్ని అందించే డిస్పోజబుల్ ప్లాస్టిక్ మీల్ ట్రేలను శుభ్రం చేస్తున్నట్లు కనిపించింది. అతను కంటైనర్లను నీటితో కడిగి.. మళ్లీ వాడటానికి ఒక కుప్పగా పేర్చుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. అనంతరం వీడియో రికార్డ్ చేస్తున్న వ్యక్తి, ఎందుకిలా కడుగుతున్నావని అడిగగా.. మొదట్లో కంటైనర్లను తిరిగి ఉపయోగించడానికంటూ ఏదో చెప్పబోయాడు. కానీ ప్యాంట్రీ సెక్షన్‌కు దూరంగా ప్రయాణీకుల వాష్ బేసిన్ వద్ద వాటిని ఎందుకు కడుగుతున్నాడో స్పష్టంగా చెప్పలేకపోయాడు.


ఈ వీడియో క్లిప్ క్షణాల్లోనే వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో భారతీయ రైల్వే, ఐఆర్‌సీటీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరైతే.. ఇది ఓ పెద్ద కుంభకోణం అని.. రైల్వే అధికారులే ఇలా చేయిస్తున్నారని ఆరోపించారు. అయితే ఘటనపై రైల్వే అధికారులు గానీ IRCTC గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఓ మీడియా సంస్థ పెట్టిన ఎక్స్ పోస్టు కింద.. IRCTC స్పందించింది. ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించి.. సంబంధిత వ్యక్తులను గుర్తించి తక్షణమే తొలగించామని తెలిపింది. లైసెన్స్ దారుడి.. లైసెన్స్ రద్దు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. విక్రేతపై భారీ జరిమానా కూడా విధించినట్లు తెలిపింది. కాగా రైళ్లలో దుప్పట్ల శుభ్రతపై గతంలో అనేక విమర్శలు రాగా.. రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. డిస్పోజబుల్ ప్లాస్టిక్ ఫుడ్ ట్రేలను తిరిగి వాడడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. వేడి భోజనం వడ్డించినప్పుడు.. కొన్ని రకాల ప్లాస్టిక్‌లు విషపూరిత రసాయనాలను రిలీజ్ చేస్తాయని వైద్యులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa