ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ర్యాలీగా వెళ్లాడు.. తండ్రి ఫోన్ చేసి వద్దన్నాడని తిరిగొచ్చేశాడు!

national |  Suryaa Desk  | Published : Sun, Oct 19, 2025, 07:48 PM

బీహార్‌లో కేంద్ర మాజీ మంత్రి అశ్వినీ చౌబే కుమారుడు అర్జిత్ శషావత్ చౌబే నామినేషన్ ర్యాలీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. భగల్‌పూర్ నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్ ఆశించిన శషావత్‌ చౌబేకు టికెట్ ఇవ్వలేదు అధిష్ఠానం. పార్టీ టికెట్ దక్కలేదనే ఆగ్రహంతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి కలెక్టరేట్‌కు చేరుకున్నారు శషావత్. అయితే ఆఖరి నిమిషంలో బీజేపీ అగ్ర నాయకత్వం, స్వయానా తండ్రి నుంచి వచ్చిన ఒక్క ఫోన్ కాల్‌తో ఆయన నామినేషన్ వేయకుండానే అలాగే వెనుదిరిగారు. ఇప్పుడిది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


పార్టీ అధిష్ఠానం తనను భగల్‌పూర్ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా ప్రకటించకపోవడంతో అర్జిత్ శషావత్ చౌబే తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ నియోజకవర్గం నుంచే ఆయన తండ్రి అశ్విని చౌబే 1995 నుంచి 2010 వరకు ప్రాతినిధ్యం వహించారు. ఈ నేపథ్యంలో తన మద్దతుదారులు, అనుచరుల కోరిక మేరకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. గురువారం (అక్టోబర్ 17) నామినేషన్ దాఖలు చేసేందుకు భారీ ర్యాలీతో కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకున్నారు.


సరిగ్గా నామినేషన్ పత్రాలు సమర్పించడానికి ముందు, మీడియా ప్రతినిధులు ఆయనతో మాట్లాడేందుకు ఎదురుచూస్తుండగా అర్జిత్‌కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. చుట్టూ జనం, మీడియా ఉండగానే ఆయన ఆ కాల్ మాట్లాడారు. కొద్దిసేపు అవతలి వైపు నుంచి మాటలు విన్న అర్జిత్.. ఇటు వైపు నుంచి పెద్దగా సమాధానం చెప్పకుండానే కాల్ కట్ చేశారు. ఆ తర్వాత ఆయన ఏం చెప్పకుండానే నామినేషన్ దాఖలు చేయకుండా వెనుదిరిగారు.


నామినేషన్ వేయకుండా వెనుదిరగడానికి గల కారణాన్ని అర్జిత్ తర్వాత మీడియాకు వివరించారు. అలా యూ-టర్న్ తీసుకోవడానికి కారణం తన తండ్రి అశ్వినీ చౌబే అని స్పష్టం చేశారు. "నువ్వు బీజేపీలో ఉన్నావు, బీజేపీలోనే ఉంటావు", అని తండ్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని అర్జిత్ తెలిపారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాలను, ముఖ్యంగా తండ్రి మాటను ధిక్కరించలేక తాను ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్లు ఆయన వివరించారు. "నేను స్వతంత్రంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పటి నుంచి బీజేపీ అగ్ర నాయకత్వం నుంచి నాపై ఒత్తిడి తీసుకువచ్చింది. ఈ రోజు నా తండ్రి, తల్లి కూడా నాతో మాట్లాడారు. అది అగ్ర నాయకత్వం నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశం. నేను నా పార్టీకి, దేశానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయలేను" అని ఆయన పేర్కొన్నారు.


భగల్‌పూర్‌లో స్థానం నుంచి బీజేపీ రోహిత్ పాండేను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పార్టీలో గందరగోళం నెలకొంది. 2020 ఎన్నికల్లో రోహిత్ పాండే కాంగ్రెస్ అభ్యర్థి అజిత్ శర్మ చేతిలో కేవలం వెయ్యి ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి కాంగ్రెస్ నుంచి అజిత్ శర్మ గత మూడు పర్యాయాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ ఆశించిన అర్జిత్, చివరికి పార్టీ పెద్దల ఆదేశాలను గౌరవించి రాజకీయ పోరాటం నుంచి ఉపసంహరించుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa