ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రష్యా నుంచి తీసుకురానున్న జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్

national |  Suryaa Desk  | Published : Sun, Oct 19, 2025, 07:50 PM

రష్యాలో వారం రోజుల పాటు ప్రదర్శనకు ఉంచిన గౌతమ బుద్ధుడి పవిత్ర అవశేషాలను తిరిగి భారత్‌కు తీసుకువస్తున్నారు. భారత్ - రష్యా మధ్య ఆధ్యాత్మిక, సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేసేలా బుద్ధుడి పవిత్ర అవశేషాలను రష్యాలోని కల్మికియాలో వారం రోజుల పాటు ప్రదర్శనకు ఉంచారు. ఈ పవిత్ర వారసత్వాన్ని తిరిగి భారత్‌కు తీసుకురావడానికి జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నాయకత్వంలో ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం శుక్రవారంం రష్యా రాజధాని ఎలిస్టాకు చేరుకుంది.


దిల్లీలోని నేషనల్‌ మ్యూజియంలో ఉండే ఈ అవశేషాలను భారత వాయుసేన ప్రత్యేక విమానంలో ఈ నెల 11న రష్యాకు తీసుకెళ్లారు. కాల్మికియా రాజధాని ఎలిస్టాలో బుద్ధుడికి సంబంధించిన ప్రధాన ఆశ్రమం(గోల్డెన్ అబోడ్ ఆఫ్ శాక్యముని బుద్ధ)లో వాటిని ఉంచారు. ఆరోజు నుంచి సుమారు లక్ష మంది బుద్ధుడి అవశేషాలను దర్శించుకుని, నివాళులు అర్పించారని కేంద్ర సాంస్కృతిక శాఖ తెలిపింది. ఇదో చరిత్రాత్మక ఘట్టమని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చెప్పుకొచ్చారు. ఈ అవశేషాల ప్రదర్శన భారత్ - రష్యా మధ్య ఆధ్యాత్మిక స్నేహానికి బలమైన వారధిగా నిలుస్తుందని, ఇది సాంస్కృతిక సంబంధాలపై భారతదేశం చేస్తున్న కృషిని, బుద్ధుడి బోధనల ఏకీకృత శక్తిని ప్రపంచానికి చాటుతుందని పేర్కొన్నారు.


ఐరోపా ఖండంలో బౌద్ధులు మెజారిటీగా ఉన్న ఏకైక ప్రాంతం కల్మికియా. వారం రోజుల పాటు జరిగిన ఈ ప్రదర్శనకు కల్మికియా ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. అధికారిక లెక్కల ప్రకారం అక్టోబర్ 18 నాటికి 90 వేల మందికి పైగా భక్తులు ఈ పవిత్ర అవశేషాలను దర్శించుకుని నివాళులర్పించారు. ఈ అవశేషాలను భారతదేశ జాతీయ సంపదగా పరిగణిస్తారు. అంతకుముందు ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కేశవ్ ప్రసాద్ మౌర్య నేతృత్వంలో సీనియర్ బౌద్ధ సన్యాసులతో కూడిన ఉన్నత స్థాయి బృందం వీటిని దిల్లీలోని జాతీయ మ్యూజియం నుంచి ప్రత్యేక భారత వైమానిక దళ విమానంలో రష్యాకు తీసుకువచ్చారు.


ఈ పవిత్ర కార్యానికి నాయకత్వం వహించే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా 'ఎక్స్' పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. రష్యాలో ఇలాంటి ప్రదర్శన జరగడం ఇదే మొదటిసారి. ఈ ఆధ్యాత్మిక యాత్ర భారత్-రష్యా సంబంధాల చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ పవిత్ర అవశేషాలను లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలోని బృందం అక్టోబర్ 19వ తేదీన తిరిగి భారత దేశానికి తీసుకురానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa