విశాఖపట్నం వేదికగా నవంబరు 14, 15 తేదీల్లో జరగనున్న భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) భాగస్వామ్య సదస్సును సరికొత్త పంథాలో నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సదస్సు కేవలం పెట్టుబడుల ఒప్పందాల (ఎంఓయూ)కే పరిమితం కాకుండా, రాష్ట్ర పారిశ్రామిక భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసే విధానాల రూపకల్పనపై విస్తృత మేధోమథనానికి వేదిక కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రపంచ ప్రఖ్యాత దావోస్ సదస్సు తరహాలో ఇక్కడ కూడా పెట్టుబడిదారులు, విధానకర్తల మధ్య ఫలవంతమైన చర్చలు జరగాలని స్పష్టం చేశారు. ఆదివారం అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఉన్నతాధికారులు, ఈడీబీ అధికారులతో కలిసి సదస్సు నిర్వహణపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, "సానుకూల పారిశ్రామిక విధానాలు ఉన్నప్పుడే వాణిజ్యం, పరిశ్రమలు పెట్టుబడులతో ముందుకు వస్తాయి. అప్పుడే రాష్ట్రంలో సంపద సృష్టి సాధ్యమవుతుంది. విశాఖ సదస్సును కేవలం పెట్టుబడులు ఆకర్షించే కార్యక్రమంగా చూడవద్దు. ఇది విజ్ఞానాన్ని పంచుకునే, భవిష్యత్ ప్రణాళికలను చర్చించుకునే ఒక మేధోమథన వేదికగా నిలవాలి" అని అన్నారు. ప్లీనరీ, బ్రేక్అవుట్ సెషన్ల ద్వారా వివిధ రంగాలపై లోతైన చర్చలు జరిగితే పరిశ్రమలకు, ప్రభుత్వానికి, అంతిమంగా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa