ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అది పర్యాటక ప్రాంతం కాకపోవడమే దాని ప్రత్యేకత అన్న మహీంద్రా

national |  Suryaa Desk  | Published : Sun, Oct 19, 2025, 09:16 PM

ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తన సోషల్ మీడియా పోస్టులతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన పంచుకున్న ఓ ఫొటో, దానికి రాసిన వ్యాఖ్య నెటిజన్ల మనసులను గెలుచుకుంటోంది. కేరళలోని ఓ మారుమూల పల్లెటూరి అందానికి ముగ్ధుడైన ఆయన, ఆధునిక జీవితపు హడావుడి నుంచి అక్కడి ప్రశాంతతలోకి వెళ్లాలని ఉందని తన మనసులోని మాటను పంచుకున్నారు.ఆకాంక్ష పి అనే ఓ నెటిజన్ ‘దక్షిణ భారత గ్రామంలో ఉదయం’ అంటూ కేరళలోని పాలాక్కాడ్ జిల్లాకు చెందిన ఓ పల్లెటూరి చిత్రాన్ని షేర్ చేశారు. పచ్చని చెట్లు, పెంకుటిల్లు, ప్రశాంతమైన వాతావరణంతో ఉన్న ఆ ఫొటో ఆనంద్ మహీంద్రాను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ చిత్రాన్ని ఆయన రీపోస్ట్ చేస్తూ తన భావాలను వ్యక్తం చేశారు. ఇది పర్యాటక ప్రాంతం కాదు, ఆ ప్రయత్నం కూడా చేయడం లేదు. కానీ నిజమైన ప్రయాణం అంటే ఇలాంటి సహజమైన అనుభూతులను మనసులో నింపుకోవడమే అని ఆయన పేర్కొన్నారు.ఆ గ్రామంలోని నిరాడంబరత, సౌందర్యం, అక్కడి జీవన లయలో తాను మౌనంగా ఓ భాగం కావాలని కోరుకుంటున్నట్లు మహీంద్రా తెలిపారు. సండేవాండరర్ గా నేను ఈ క్షణం ఆ గ్రామంలో అడుగుపెట్టాలని కోరుకుంటున్నాను అని ఆయన రాసుకొచ్చారు. ఆధునిక జీవితంలోని నిర్విరామ వేగం నుంచి తప్పించుకోవడానికి ఇంతకంటే గొప్ప ప్రదేశం మరొకటి ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.ఆనంద్ మహీంద్రా చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. యాంత్రిక జీవితంతో విసిగిపోయిన ఎంతోమంది ఆయన అభిప్రాయంతో ఏకీభవించారు. నిజమైన ఆనందం, ప్రశాంతత ఇలాంటి సహజమైన ప్రదేశాల్లోనే దొరుకుతాయని కామెంట్లు పెడుతున్నారు. వాణిజ్య పర్యాటకం కంటే ఇలాంటి అనుభూతులే ఎంతో విలువైనవని నెటిజన్లు పేర్కొంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa