ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నకిలీ మద్యం కేసులో ఏ విచారణకైనా సిద్ధమన్న జోగి రమేశ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 19, 2025, 09:28 PM

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నకిలీ మద్యం కేసులో తనపై వస్తున్న ఆరోపణలపై వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్య అని, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ కేసులో తన పేరును ఇరికిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కేసులో తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమని, అవసరమైతే లై డిటెక్టర్ పరీక్షకు కూడా వస్తానని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తనను అన్యాయంగా జైలుకు పంపాలనే ఏకైక లక్ష్యంతోనే ఈ కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.మీడియాతో మాట్లాడిన జోగి రమేశ్, ప్రభుత్వంపై పలు సూటి ప్రశ్నలు సంధించారు. "నకిలీ మద్యం కేసులో నన్ను ఇరికించాలని చూస్తున్నారు. నేను ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాను. మీరు చెప్పిన చోటికి లై డిటెక్టర్ పరీక్షకు కూడా వస్తాను. కానీ, ఈ కేసులో మీరు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి" అని అన్నారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్‌ను ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేసి పిలిపించి, అతనితో బలవంతంగా తన పేరు చెప్పించిందని ఆరోపించారు. అసలు పోలీస్ కస్టడీలో ఉన్న నిందితుడి వీడియో బయటకు ఎలా లీక్ అయిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జనార్దన్, జయచంద్రారెడ్డి స్నేహితులని స్వయంగా చంద్రబాబే గతంలో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.మద్యం వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తికి టీడీపీ టికెట్ ఎలా ఇచ్చిందని జోగి రమేశ్ నిలదీశారు. "తంబళ్లపల్లె నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జయచంద్రారెడ్డికి మద్యం వ్యాపారం ఉందని మీకు తెలియదా తెలిసీ అతనికి టికెట్ ఎలా ఇచ్చారు దీని వెనుక ఎలాంటి సూట్‌కేస్ ఒప్పందాలు జరిగాయి అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో నిజాయతీ ఉంటే చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మంచి నీటి కుళాయిల కంటే బెల్టు షాపులే ఎక్కువగా ఉన్నాయని, ప్రభుత్వ మద్యం పాలసీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని విమర్శించారు.ఈ కేసులో తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి తాను ఎక్కడైనా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని జోగి రమేశ్ స్పష్టం చేశారు. "నేను తిరుమల వెంకన్న లేదా బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో ప్రమాణం చేస్తాను. అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి వచ్చి అయినా ప్రమాణం చేయడానికి సిద్ధం. నాపై బురద జల్లాలనే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారు. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని దుర్మార్గమైన రాజకీయాలు చేయడం మానుకోవాలి" అని హితవు పలికారు. తనపై చేస్తున్న ఆరోపణలను నిరూపించలేకపోతే చంద్రబాబు, లోకేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa