ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కివీస్‌తో మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు,,,,సెంచరీలతో రాణించిన స్మృతి మంధాన, ప్రతికా

sports |  Suryaa Desk  | Published : Thu, Oct 23, 2025, 11:02 PM

మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లు సత్తాచాటారు. నవీ ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పరుగుల వరద పారించారు. ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతికా రావల్ సెంచరీలతో చెలరేగిపోయారు. జెమీమా రోడ్రిగ్స్ మెరుపు బ్యాటింగ్‌తో అలరించింది. దీంతో భారత్ ఈ మ్యాచ్‌లో 3 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు.


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్.. భారత్‌కు బ్యాటింగ్ అప్పగించింది. అయితే న్యూజిలాండ్ కెప్టెన్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదని తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు. సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన స్థితిలో క్రీజులోకి వచ్చిన భారత ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతికా రావల్ ధాటిగా బ్యాటింగ్ చేశారు. ఎడా పెడా ఫోర్లు సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 212 పరుగులు జోడించారు. ఇద్దరూ సెంచరీలు కూడా పూర్తి చేసుకున్నారు.


 మంధాన (95 బంతుల్లో 109 రన్స్‌) ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన జెమీమా రోడ్రిగ్స్.. కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించింది. చేతిలో వికెట్లు ఉండటంతో ధాటిగా బ్యాటింగ్ చేసింది. ప్రతికా రావల్ (134 బంతుల్లో 122) రన్స్ సెంచరీ చేసిన తర్వాత ఔట్ అయింది. అయితే ఇన్నింగ్స్ ముగియడానికి మరో రెండు ఓవర్లు ఉందనగా.. వర్షం ఎంట్రీ ఇచ్చింది. దీంతో మ్యాచ్ చాలాసేపు ఆగిపోయింది. ఆ తర్వాత వర్షం తగ్గడంతో అంపైర్లు మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు.


వర్షం ఆగిపోయే సరికే భారత్ 48 ఓవర్లలో 329/2తో నిలిచింది. ఆ తర్వాత మరో ఓవర్ బ్యాటింగ్ చేసి 11 పరుగులు రాబట్టింది. దీంతో 49 ఓవర్లలో 340/3 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ 55 బంతుల్లో 76 రన్స్ చేసి అజేయంగా నిలిచింది. రిచా ఘోష్ తాను ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీకి పంపించింది. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్ అవకాశాలను గణనీయంగా పెంచుకుంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa