ఈ 2025 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి మానీటరీ, పాలసీ సంబంధిత మార్పులు జరిగాయి. అందులో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అమలులోకి తీసుకురావడం, డీఏ, డీఆర్ పెంపు, డ్రెస్ అలవెన్సుల పెంపు, పెన్షన్ ప్రాసెస్లో మార్పు వంటివి ఉన్నాయి. ఈ క్రమంలో ఉద్యోగుల రిటైర్మెంట్ సంబంధించిన 5 మేజర్ మార్పుల గురించి ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. ఈ కొత్త మార్పులు ఉద్యోగుల జేబుకు చిల్లు పెట్టడమే కాదు భవిష్యత్తును సైతం ప్రభావితం చేయనున్నాయి.
1.అమలులోకి కొత్త పెన్షన్ స్కీమ్
పాత పెన్షన్ స్కీమ్ స్థానంలో 2004లో నేషనల్ పెన్షన్ సిస్టమ్ తీసుకొచ్చారు. రిటైర్మెంట్ ఆదాయాన్ని మార్కెట్తో లింక్ చేశారు. దీంతో ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వచ్చింది. పాత పెన్షన్ విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలనే డిమాండ్లు వచ్చాయి. ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ స్కీమ్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ను 2025, ఏప్రిల్ నెలలో అమలులోకి తెచ్చింది. ఎన్పీఎస్, ఓపీఎస్ ఫీచర్లను కలగలిపి ఈ కొత్త పథకాన్ని లాంచ్ చేసినట్లు పేర్కొంది. ఇందులో ఉద్యోగి 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుంటే చివరి 12 నెలల బేసిక్ శాలరీలో 50 శాతం పెన్షన్ రూపంలో వస్తుంది. 10 ఏళ్లు పూర్తి చేసుకున్నవారికి కనీస పెన్షన్ రూ.10 వేలుగా ఫిక్స్ చేశారు.
2.డీఏ, డీఆర్ అలవెన్సుల పెంపు
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది 2025లో రెండు సార్లు డీఏ, డీఆర్ పెంపు ప్రకటన చేసింది. జనవరి- జూన్ సమయానికి గానూ 2 శాతం డీఏ పెంచింది. ఇక జూలై- డిసెంబర్ సమయానికి డీఏ 3 శాతం పెంచుతున్నట్లు వెల్లడించింది. దీంతో ప్రస్తుత డీఏ 58 శాతానికి చేరుకుంది. లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఇది ప్రయోజనం చేకూర్చనుంది.
3. రిటైర్మెంట్ ప్రాసెస్లో మార్పు
ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోందని ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ఉద్యోగుల రిటైర్మెంట్కు 12-15 నెలల ముందే ఫైల్ సిద్ధం చేయాలని అన్ని విభాగాలకు డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ ఆదేశాలు జారీ చేసింది. రిటైర్మెంట్ రోజునే పెన్షన్, గ్రాట్యూటీ సహా ఇతర ప్రయోజనాలు మొత్తం చేతికి అందేలా చూడాలని స్పష్టం చేసింది.
4. డ్రెస్ అలవెన్సులు
గతంలో డ్రెస్ అలవెన్సులు ఏడాదికి ఒకసారి ఫిక్స్డ్ అమౌంట్ చెల్లించే వారు. ఒకవేళ ఉద్యోగి ఏడాది మధ్యలోనే రిటైర్మెంట్ అయినా ఇదే రూల్ పాటించేవారు. అయితే, ఇందులో మార్పులు చేశారు. ఒకవేళ ఉద్యోగి మిడ్ ఇయర్లో రిటైర్ అయితే ప్రో రాటా ఆధారంగా డ్రెస్ అలవెన్సు ఇవ్వునున్నారు. అంటే ఎన్ని నెలలు పని చేశారు అనే దాని ఆధారంగా లెక్కిస్తారు. ఈ మార్పు చిన్నదే అయినా జూన్, సెప్టెంబర్ నెలల్లో రిటైర్ అయ్యే వేలాది మంది ఉద్యోగులను ప్రభావితం చేయనుంది.
5. గ్రాట్యూటీలో మార్పులు
గ్రాట్యూటీకి సంబంధించిన రూల్స్లోనూ ప్రభుత్వం మార్పులు చేసింది. ఇప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో గ్రాట్యూటీ సొమ్ము చేతికి అందనుంది. యూపీఎస్లో గ్రాట్యూటీ, లంప్సమ్ పేమెంట్స్ ఉంటాయి. గతంలో ఎన్పీఎస్లోని ఉద్యోగులు ఈ బెనిఫిట్స్ చాలా తక్కువగా అందుకునే వారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం యూపీఎస్ కింద మార్పులు చేసి రిటైర్మెంట్ నాటికి పెద్ద మొత్తంలో చేతికి డబ్బులు అందేలా చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa