ఈ ఏడాది పత్తికి క్వింటాకు రూ. 8,110 చొప్పున కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర (MSP) ప్రకటించడం రైతులకు కొంత ఊరటనిచ్చింది. అయితే, ఈ ధర పూర్తిగా దక్కాలంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలు, ముఖ్యంగా తేమ శాతం నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. సాధారణంగా సీసీఐ గరిష్టంగా 8 నుంచి 12 శాతం తేమను మాత్రమే కొనుగోళ్లకు అనుమతిస్తుంది. ఈ నిబంధన కారణంగా పత్తిని విక్రయించే సమయంలో తమకు పూర్తి మద్దతు ధర లభిస్తుందో లేదోనని రైతులు ఇప్పుడు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
పత్తి పంట కోత దశకు చేరుకున్న ఈ సమయంలో, కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, వరదలు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. దీనికితోడు చీడపీడల బెడద కూడా తోడవ్వడంతో పంట దిగుబడి తగ్గడమే కాకుండా, పత్తి నాణ్యత కూడా క్షీణించే పరిస్థితి ఏర్పడింది. తడిసిన పత్తిలో తేమ శాతం సహజంగానే CCI అనుమతించిన పరిమితి కంటే ఎక్కువగా ఉంటోంది. దీంతో, నాణ్యతా లోపం కారణంగా మద్దతు ధర కంటే తక్కువ ధరకే పత్తిని అమ్ముకోవాల్సి వస్తుందేమోనని అన్నదాతలు భయపడుతున్నారు.
సీసీఐ నిబంధనల ప్రకారం తేమ శాతం 12% కంటే ఎక్కువ ఉంటే కొనుగోలుకు నిరాకరించే ప్రమాదం ఉంది. ఒకవేళ 8% నుంచి 12% మధ్య తేమ ఉన్నా, దాని నిష్పత్తిని బట్టి మద్దతు ధరలో కోత విధించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో పత్తిలో తేమశాతం అధికంగా ఉండటంతో, సీసీఐ కేంద్రాల్లో అధికారులు తేమ పేరు చెప్పి ధర తగ్గిస్తారనే ఆందోళన రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెట్టుబడి వ్యయాలు పెరిగిన నేపథ్యంలో, మద్దతు ధరలో కోత పడితే ఆర్థికంగా మరింత నష్టపోతామని వారు ఆవేదన చెందుతున్నారు.
ఈ పరిస్థితుల దృష్ట్యా, పత్తి రైతులు ప్రభుత్వ జోక్యం కోసం ఎదురుచూస్తున్నారు. అకాల వర్షాల వల్ల కలిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని, CCI తన తేమశాతం నిబంధనల్లో కొంత సడలింపు ఇవ్వాలని లేదా 12% కంటే ఎక్కువ తేమ ఉన్న పత్తిని కూడా కొనుగోలు చేసి రైతులకు నష్టం లేకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే, ప్రకటించిన రూ. 8,110 మద్దతు ధర కేవలం కాగితాలకే పరిమితమై, ప్రైవేట్ వ్యాపారుల వద్ద తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని పత్తి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa