పాకిస్థాన్, సౌదీ అరేబియా మధ్య ఇటీవల కుదిరిన వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. పైకి చూస్తే, తమలో ఒకరిపై దాడి జరిగినా ఇద్దరూ కలిసి ఎదుర్కోవాలనే రక్షణ నిబంధన ఈ ఒప్పందంలో ప్రధానాంశం. NATO కూటమిలోని ఆర్టికల్ 5 తరహాలో ఉన్న ఈ నిబంధన ఇరు దేశాల రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. అయితే, ఈ ఒప్పందం వెనుక దాగిన ఆర్థిక అంశం.. పాకిస్థాన్ తన సైనిక శక్తిని 'అద్దె'కు ఇవ్వడాన్ని బహిర్గతం చేసింది.
తీవ్రమైన రాజకీయ, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్కు ఈ ఒప్పందం ఒక లైఫ్లైన్గా మారింది. సౌదీ అరేబియాకు 25,000 మంది పాకిస్థాన్ సైనికులను పంపించడానికి బదులుగా, సౌదీ నుంచి పాక్ భారీ ఆర్థిక ప్యాకేజీని అందుకోనుంది. ఈ డీల్ విలువ దాదాపు ₹88,000 కోట్లు (సుమారు 10 బిలియన్ డాలర్లు)గా తెలుస్తోంది. రుణాలు, ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న పాకిస్థాన్, సైన్యాన్ని అద్దెకు ఇవ్వడం ద్వారా తక్షణమే విదేశీ మారక ద్రవ్యాన్ని, పెట్టుబడులను ఆకర్షించాలని చూస్తోంది.
చారిత్రక మిత్ర దేశాలైన పాకిస్థాన్, సౌదీ అరేబియా మధ్య సైనిక సహకారం కొత్తేమీ కాదు. 1970ల నుండి పాక్ సైనికులు సౌదీలో మోహరించి, అక్కడి సైన్యానికి శిక్షణనిస్తున్నారు. మక్కా, మదీనాల పవిత్ర స్థలాల రక్షణ కోసం కూడా పాక్ జవాన్లను పంపింది. అయితే, తాజా ఒప్పందంలో సైనికుల సంఖ్య, దానికి ప్రతిగా అందించే ఆర్థిక ప్యాకేజీ విలువ భారీగా ఉండడం, పాకిస్థాన్ ఆర్థిక అవసరాలను ప్రధానంగా ప్రతిబింబిస్తోంది. డబ్బు కోసం తన సైనిక బలగాన్ని బేరానికి పెట్టిందనే విమర్శలకు ఈ పరిణామం తావిచ్చింది.
ఈ రక్షణ ఒప్పందం ప్రాంతీయంగా భారత్కు ఆందోళన కలిగించే అంశంగా మారింది. పాక్పై భారత్ దాడి చేస్తే సౌదీ కూడా అండగా నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పాకిస్థాన్ తన అణు కవచాన్ని సౌదీకి అందిస్తుందనే ఊహాగానాలు కూడా గతంలో వచ్చాయి. ఈ పరిణామాన్ని భారత విదేశాంగ శాఖ నిశితంగా పరిశీలిస్తోంది. ఏది ఏమైనా, దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు పాకిస్థాన్ తన సైనిక శక్తిని ఒక ఆర్థిక వనరుగా ఉపయోగించుకోవడం, అంతర్జాతీయంగా కొత్త ఒరవడికి తెర తీసినట్లయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa