ఫరీదాబాద్లో ఓ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవలు చిలికిచిలికి గాలివానగా మారడంతో యోగేశ్ కుమార్ అనే భర్త అపార్ట్మెంట్లోని 15వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వీరి వైవాహిక జీవితం తొమ్మిదేళ్లుగా కొనసాగుతున్నప్పటికీ, ఇటీవల కుటుంబ వ్యవహారాలపై ఏర్పడిన అభిప్రాయభేదాలు ఈ దారుణ నిర్ణయానికి దారితీసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
యోగిష్ కుమార్ (నేహా దంపతులిద్దరూ ఉద్యోగులే. వీరికి ఆరేళ్ల కూతురు ఉంది. చిన్నారిని చూసుకోవడం కోసం యోగేశ్ తన తల్లిని ఇటీవల ఇంటికి పిలిపించుకున్నారు. అయితే, కూతురి సంరక్షణ విషయంలో అత్త రావడంపై నేహా, ఆమె కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో యోగేశ్కు, నేహా కుటుంబానికి మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. ఈ వివాదాలు తరచుగా ఇంటిలో పెద్ద గొడవలకు దారితీశాయి.
తాజాగా, మళ్లీ ఇదే విషయంపై దంపతుల మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ గొడవల పరంపరతో తీవ్రంగా మనస్తాపానికి గురైన యోగేశ్ కుమార్, క్షణికావేశంలో తన నివాసముంటున్న బిల్డింగ్ 15వ అంతస్తు నుంచి కిందకు దూకేశారు. ఈ ఆత్మహత్యకు గల కారణాలపై స్పష్టతనిస్తూ, యోగేశ్ కుటుంబ సభ్యులు నేహా, ఆమె బంధువుల వేధింపులే తమ కొడుకు మరణానికి కారణమని ఆరోపించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్య నేహా సహా మొత్తం ఐదుగురిపై ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆరోపణలతో కేసు ఫైల్ చేశారు. కుటుంబ కలహాలు ఎంతటి దారుణమైన పరిణామాలకు దారితీస్తాయో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలిచింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa