ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జేఎన్టీయూ ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం..ఇద్దరు సూడాన్ యువకులు అరెస్ట్

Crime |  Suryaa Desk  | Published : Sun, Oct 26, 2025, 09:41 PM

హైదరాబాద్‌ జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ సమీపంలో ఆదివారం ఉదయం ఒక కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి ఆ తర్వాత అదుపుతప్పి ఒక ద్విచక్ర వాహనాన్ని సైతం ఢీకొట్టింది. ఈ ఘటన ఉదయం 7.50 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు వ్యక్తులు ఉన్నారు. అందులో ఇద్దరు యువకులు కాగా.. మరో ముగ్గురు యువతులు. కారు నడుపుతున్న యువకులను పోలీసులు తనిఖీ చేయగా.. వారు సూడాన్ దేశస్థులుగా గుర్తించారు. ఈ యువకులు నగరంలో విద్యనభ్యసిస్తూ, శంషాబాద్ ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు తెలిసింది.


అయితే, ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న ముగ్గురు యువతులు అక్కడ నుంచి దిగిపోయి హడావుడిగా మరో క్యాబ్‌ బుక్‌ చేసుకుని వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అతి వేగంగా, అజాగ్రత్తగా వాహనం నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనలో ఎవరూ గాయపడకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు వెంటనే సూడాన్‌కు చెందిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ కారును వారు అద్దెకు తీసుకున్నారా? లేదా ఎవరైనా ఇచ్చారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతుల ఆచూకీ కోసం కూడా ప్రయత్నిస్తున్నామని దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.


ఇక కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం పత్లాపూర్ గ్రామ సమీపంలోని 161వ జాతీయ రహదారిపై కూడా రోడ్డు ప్రమాదం జరిగింది. షిర్డీ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం చేస్తున్న ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. కారులో మొత్తం నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa