తెలంగాణ రాష్ట్రంలో బాలికలు, మహిళలకు రక్షణ కరువవుతున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా విద్యా సంస్థల్లోనే ఇలాంటి దారుణాలు జరగడం సమాజాన్ని కలిచి వేస్తోంది. తాజాగా కరీంనగర్ జిల్లాలోని కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకున్న ఘటన తల్లిదండ్రుల్లో తీవ్ర ఆగ్రహాన్ని, భయాన్ని పెంచింది. అసలు ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో బాలికల వాష్రూమ్లో సీక్రెట్ కెమెరా బయటపడటం ఈ వికృత చర్యకు సంబంధించిన వివరాలను వెలుగులోకి తెచ్చింది. వాష్రూమ్లో మెరుస్తున్న పరికరం బాలికల కంట పడటంతో.. అనుమానం వచ్చి వారు దానిని తనిఖీ చేయగా.. అది సీక్రెట్ కెమెరా అని గుర్తించారు. ఈ దారుణానికి ఒడిగట్టింది ఆ పాఠశాలకు చెందిన అటెండర్ యాకూబ్ అని తేలింది. ఇతను సీక్రెట్ కెమెరాను అమర్చి.. వీడియోలు రికార్డు చేస్తూ వికృత ఆనందం పొందుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అంతే కాకుండా.. అటెండర్ యాకూబ్ బాలికల ఫొటోలు తీసి వాటిని అశ్లీల చిత్రాలుగా మార్ఫింగ్ కూడా చేస్తున్నట్లు సమాచారం.
బాలికలు, వారి తల్లిదండ్రులు వెంటనే ఈ విషయాన్ని హెడ్మాస్టర్కు ఫిర్యాదు చేశారు. హెడ్మాస్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు వాష్రూమ్ నుంచి కెమెరా తరహా పరికరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ పరికరంలో ఉన్న రికార్డుల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితుడైన అటెండర్ యాకూబ్ ఈ విషయం బయటపడటంతోనే పరారీలో ఉన్నాడు.
ప్రస్తుతం పోలీసులు అతని కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. స్కూల్ వాతావరణంలో ఇలాంటి ఘటనలు జరగడం దారుణం. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఈ వ్యవహారానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని విద్యార్థులు తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన చోటే.. రక్షణ లేకపోవడం, కామాంధుల వికృత చేష్టలు తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనను పెంచుతున్నాయి. ఇలాంటి ఘటనలు పాఠశాలల్లోని భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. అధికారులు తక్షణమే స్పందించి, పాఠశాలల్లో బాలికలకు భద్రత కల్పించడానికి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa